సిరిసిల్లకు మంత్రి రామన్న మరో వరం
బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ఆమోదం
ఉద్యోగార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ
పేద విద్యార్థుల్లో ఆనందం
సిరిసిల్ల, ఏప్రిల్ 14 :సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలనే సంకల్పంతో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న మంత్రి కేటీఆర్, ఇటీవలే కార్మికక్షేత్రానికి మరో వరం అందించారు. ఆర్థిక స్థోమత లేని ప్రతిభ గల విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు బీసీ స్టడీ సర్కిల్ను ప్రకటించారు. ఇప్పటికే ఉత్తర్వులు రాగా, సెంటర్ నిర్వహణకు పోస్టులు సైతం మంజూరు చేశారు. త్వరలో బీసీ స్టడీ సర్కిల్ అందుబాటులోకి రానుండగా పేద విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ చొరవ..
జిల్లాలోని పేద విద్యార్థులు పోట పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు స్థానికంగా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వారికి వరంలా మారింది. కొంత కాలంగా బీసీ స్టడీ సెంటర్ను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని పలువురు నేతలు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మంత్రి కేటీఆర్కు వినతులు అందించారు. యువత ఉన్నతిని ఆకాంక్షించిన మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి బీసీ స్టడీ సెంటర్ను మంజూరు చేశారు.
నోటిఫికేషన్లకు సిద్ధం
ఇటీవల ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నోటిఫికేషన్కు ముందే సిరిసిల్లలో స్టడీ సెంటర్ ఏర్పాటు కావడం యువత అదృష్టంగా భావిస్తున్నది. పోటీ పరీక్షలకు సరైన సమయంలో మంత్రి కేటీఆర్ స్టడీ సర్కిల్ను మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అన్ని పోటీ పరీక్షలకు నిపుణులైన అధ్యాపకులచే ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. నిరుద్యోగ బీసీ యువతకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు.
జిల్లాలోని డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు పోటీ పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్కు వెళ్తున్నారు. అక్కడే శిక్షణ పొందుతూ వసతి కోసం వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. బీసీ కుటుంబాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో బీసీ విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్నది. డిగ్రీలు, పీజీలు, సాంకేతిక కోర్సులు పూర్తిచేసిన పేద యువత ఉద్యోగాల సాధన కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత చదువులు చదివిన యువతులు శిక్షణ కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక పోటీ పరీక్షలకు హాజరు కాలేకపోతున్నారు. కొంతమంది యువత స్థానిక గ్రంథాలయంలోని కాంపిటీటివ్ పుస్తకాలతో కుస్తీ పడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
త్వరగా స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ఆదేశాలు..
జిల్లా కేంద్రంలో సాధ్యమైనంత త్వరగా స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసి యువతకు అందుబాటులో తీసుకురావాలని, స్టడీ సర్కిల్ కార్యకలాపాలను ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, రాష్ట్ర బీసీ నైపుణ్య శిక్షణా కేంద్రం డైరెక్టర్కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వెంకటేశం సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు.
పోస్టులు మంజూరు..
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే బీసీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని భావిస్తు న్నారు. దీని నిర్వహణకు వివిధ స్థాయిలో ఎనిమిది పోస్టులను మంజూరు చేశారు. సర్కిల్ డైరెక్టర్ పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిన, మిగిలిన పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియమించేందుకు అనుమతులు జారీ చేశారు. కోర్సు కో ఆర్డినేటర్ , అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్, నైట్వాచ్మెన్ పోస్టులను మంజూరు చేశారు. ఇవే కాకుండా రెండు కార్యాలయ సబార్డినేట్ పోస్టులను కూడా మంజూరు చేశారు. స్టడీ సెంటర్ నిర్వహణ కోసం 77.80లక్షలు కూడా మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోటీపరీక్షలకు సువర్ణావకాశం..
మంత్రి కేటీఆర్ యువతకు భవిష్యత్తు అవకాశాల కోసం బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ను సిరిసిల్లలో ఏర్పాటు చేయడం నిరుద్యోగులకు ఇది సువర్ణావకాశం. నేడు డిగ్రీ పూర్తి చేసి కాంపిటీటివ్ పరీక్షలకు చదువుతున్న.. మంత్రి కేటీఆర్ కల్పించిన ఈ అవకాశంతో ఆర్థిక భారం పడకుండా శిక్షణ పొంది పరీక్షలకు సిద్ధమవుతా. మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటాం.
ఇవి కూడా చదవండి
ఇంటర్ బోర్డు ఉద్యోగుల విభజన చేపట్టండి
ప్రచారంలో సీఎం సభ పతాక సన్నివేశం