పరిగి, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పడిందని, ఆయన చూపిన బాటలోనే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రంగాపూర్లో ఎంపీపీ అరవిందరావు, సుల్తాన్పూర్లో నార్మాక్స్ డైరెక్టర్ పి.వెంకట్రాంరెడ్డి, మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటయ్య నివాళులర్పించారు.
పూడూరు, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్, కంకల్, అంగడి చిట్టంపల్లి, చన్గోముల్, మిట్టకంకల్, మన్నెగూడ, కండ్లపల్లి, మీర్జాపూర్ గ్రామాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, జాతీయ అంబేద్కర్ బహుజన అవార్డు గ్రహీత కడ్మూర్ ఆనందం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుతో పాటు దేశంలోని మహానీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలన్నారు.
దోమ, ఏప్రిల్ 14 : అంబేద్కర్ భరతజాతికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. దోమ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి నివాళులర్పించారు. మండలంలోని అయినాపూర్, దాదాపూర్, దిర్సనంపల్లి, మోత్కూర్ గ్రామాల్లో జయంతిని నిర్వహించారు.
కులకచర్ల, ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆశయాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. కులకచర్ల పెద్ద గేటు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో యువజన సంఘాల సభ్యులు, వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. చెల్లాపూర్లో సర్పంచ్ చంద్రయ్య, కులకచర్ల గ్రామపంచాయతీలో సర్పంచ్ సౌమ్యారెడ్డి, చౌడాపూర్లో ఎంపీటీసీ శంకర్ నివాళులర్పించారు.
పెద్దేముల్, ఏప్రిల్ 14 : పెద్దేముల్, గాజీపూర్ గ్రామాల్లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి స్థానిక నాయకులు, సర్పంచులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. జ్ఞానాన్ని పూర్తిస్థాయిలో సాధించి ప్రతిఒక్కరూ అక్షరాస్యులుగా మారినప్పుడే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
తాండూరు, ఏప్రిల్ 14 : తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఆర్డీవో అశోక్కుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యవేదిక ప్రతినిధులు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఆర్పీఎస్, సీపీఐ, జనచైతన్య యువజన సంఘంతోపాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ పేద, దళిత కుటుంబంలో పుట్టి కుల వివక్షతపై గళం విప్పి చదువు, విజ్ఞానం ఆయుధాలుగా భావించి అంటరానితనం, అసమానతలను అంతమొందించి వారికి స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని ప్రసాదించాడని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ సంకల్ప శక్తి, మేధా సంపత్తితో దళితులతోపాటు వెనుకబడినవారికి సమాన హక్కులు సాధించేలా కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
తాండూరు రూరల్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. అంతారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాలు సాధించేందుకు యువత కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మండలం, అల్లాపూర్, మిట్టబాసుపల్లి, మల్కాపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించగా, అంతారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులఅర్పించారు. జిల్లా గ్రంథలాయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ను ఓ కులానికి అంటగట్టవద్దని, దేశం యావత్తుకు ఆయన మార్గదర్శని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్ మాట్లాడుతూ రాజ్యంగం లేకపోతే మనం లేమని, రాజ్యంగం ఉన్నందునే మనందరం బతుకుతున్నామన్నారు.
బషీరాబాద్, ఏప్రిల్ 14 : మండలంలోని ఇందర్చెడ్, మంతట్టి, కాశీంపూర్, నవల్గా, జీవన్గి, ఎక్మాయి, మైల్వార్, రెడ్డిఘణపూర్, ఇందర్చెడ్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక కులానికి, వర్గానికి చెందినవాడు కాడని అందరివాడని పేర్కొన్నారు.