మహబూబ్నగర్ : పోలేపల్లి ఐటీ సెజ్ కోసం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంతో కృషి చేశారని, ఐటీ సెజ్తో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జడ్చర్ల పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పల్లెలు, పట్టణాలను ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు.
ఆసరా పెన్షన్లను 10 రెట్లు పెంచి తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందన్నారు. 40 లక్షల మందికి రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ అన్నారు. అర్హులైన మిగతా వారికి కూడా త్వరలోనే పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇంట్లో తినే సన్నబియ్యం బువ్వే సంక్షేమ హాస్టళ్ల పిల్లలకు పెడుతున్నట్లు చెప్పారు.
గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ. లక్షా 25 వేలు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్తో ఉన్నత చదువులు చెప్పిస్తున్నట్లు వివరించారు. కరోనా ఆపత్కాలంలో ప్రైవేటు టీచర్లకు రూ.2 వేలు, 25 కేజీల బియ్యం అందజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మంత్రి కేటీఆర్ బుధవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కావేరమ్మపేటలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్, కావేరమ్మపేట నుంచి గంగాపుర్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. కావేరమ్మపేటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. జడ్చర్ల హౌసింగ్ బోర్డు వద్ద రూ.15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.