‘నిజామాబాద్ ప్రజల చిరకాలవాంఛ పసుపు బోర్డుపై మాట తప్పడంపై ఏమంటారు? తీసుకొస్తానని బాండ్పేపర్పై హామీ ఇచ్చిన ఆ జెంటిల్మెన్ని అడగండి. బెంగాల్, కేరళ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ప్రజాస్వామ్యం గెలుస్తుంది. సర్.. మీరు హీరోలా ఉన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడూ ప్రయత్నించలేదా? మరీ పెద్దచెట్టు ఎక్కిస్తున్నావ్’..!! ఆదివారం ట్విట్టర్లో నిర్వహించిన ‘ఆస్క్ కేటీఆర్’లో నెటిజన్ల నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలు, వాటికి కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు! ఆదివారం 90 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమం ట్విట్టర్ ట్రెండింగ్లో నంబర్ 1గా నిలిచింది.
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలవుతాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. నాగార్జునసాగర్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం టీఆర్ఎస్ అభ్యర్థికే ఉన్నదని.. గతానికి ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డికి, భవిష్యత్కు ప్రాతినిధ్యం వహించే యువకుడు నోముల భగత్కు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం కారణంగానే కరోనా సమయంలోనూ తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఏడాది కూడా ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. ఆదివారం #AskKTR కార్యక్రమం ట్విట్టర్ రాజకీయవిభాగంలో దేశంలోనే ట్రెండింగ్ నంబర్ 1 గా నిలిచింది. మొత్తం12,300 మంది పలు అంశాలపై ట్వీట్లు చేశారు. అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు ఒకవైపు.. సమకాలిన రాజకీయాలు మరోవైపు.. కుర్రకారు సరదా ప్రశ్నలకు ఇంకోవైపు.. అంతే సరదాగా సమాధానాలు.. మొత్తం గంటన్నరపాటు ట్విట్టర్ వేదికగా సాగిన ప్రశ్నల పరంపరకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ
హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలతోపాటు, ద్వితీయశ్రేణి నగరాలకూ ఐటీని విస్తరించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుత సమయంలో లాక్డౌన్ విధించడమనేది మంచి నిర్ణయం కాదని తన అభిప్రాయం గా చెప్పిన ఆయన, రాష్ట్రంలో ఆ అవకాశం లేదని స్పష్టంచేశారు. తెలంగాణతోపాటు, దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన నూతన మున్సిపల్, పంచాయతీ చట్టాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. దేశంలో ప్రైవేటు టీచర్లకు ఆర్థికమద్దతు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంలో వ్యవహరించారని పేర్కొన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్లతో నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడ్తామని తెలిపారు. కరోనాపై అవగాహన కల్పించేలా ప్రత్యేకంగా పాట రూపొందిస్తానని చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు ధన్యవాదాలు తెలిపారు.
రెండువేల కోట్లతో బడుల అభివృద్ధి
రాష్ట్రంలో పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రెండువేల కోట్లతో కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వికారాబాద్లోని అనంతగిరి ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్గా తయారుచేసేందుకు ఆ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి పనిచేస్తామని చెప్పారు. నిజామాబాద్, మహబూబ్నగర్ ఐటీహబ్ నిర్మాణం కొనసాగుతున్నదని అన్నారు. తెలంగాణ ఫైబర్గ్రిడ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని, మొదటి దశలో 12,751 గ్రామాలకు ఆగస్టు చివరి వరకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుతుందని, తర్వాత నగరప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. త్వరలో నూతన రేషన్కార్డులను అందించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలు
హైదరాబాద్లో ప్రస్తుతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని.. అవన్నీ వెంటనే పూర్తయ్యేలా చూస్తానని మంత్రి తెలిపారు. నాలాలపై ఆక్రమణల తొలగింపు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ పరిధిలో మూత్రశాలలను జీహెచ్ఎంసీ విజయవంతంగా నిర్వహిస్తున్నదని.. కానీ, అక్కడక్కడా కొందరు దుండగులు వాటిని ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 6 కిలోమీటర్ల భారీ పొడవుతో ఉంటుందని, వచ్చే పన్నెండు నెలల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీల రూపకల్పనలో తెలివైన విద్యార్థుల నుంచి సలహాలు తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్లో మిస్సింగ్, లింకు రోడ్ల పనులు కొనసాగుతున్నాయని, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. ఫార్మాసిటీకి భూసేకరణ కొనసాగుతున్నదని.. కరోనా వల్ల కొంత ఆలస్యమైందని తెలిపారు.
ఫటాఫట్ ప్రశ్నలు.. జవాబులు
నిజామాబాద్ ప్రజల చిరకాల వాంఛ పసుపు బోర్డుపై మాట తప్పడంపై ఏమంటారు?
అది తీసుకొస్తానని బాండ్పేపర్ మీద హామీ ఇచ్చిన ఆ జెంటిల్మెన్ని అడగండి.
ఉత్పత్తి, తయారీ తదితర రంగాల్లో చైనా వంటి దేశాలతో ఎందుకు పోటీ పడలేకపోతున్నాం?
చైనా వంటి దేశంతో పోటీ పడాలంటే భారీ ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్క్ లేదా హైదరాబాద్ ఫార్మాసిటీ వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేదు.
బెంగాల్, కేరళ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?
ప్రజాస్వామ్యం గెలుస్తుంది.
కేటీఆర్ సర్.. మీరు హీరోలా ఉన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడూ ప్రయత్నించలేదా?
బాలీవుడ్.. హాలీవుడ్…! మరీ పెద్దచెట్టు ఎక్కిస్తున్నావ్.
మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు?
రాహుల్ ద్రావిడ్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ
జాతి రత్నాలు సినిమా ఎలా ఉన్నది?
చాలా బాగుంది. పూర్తి హాస్యభరిత చిత్రం.
మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా?
ఇంకా తీసుకోలేదు.
ఒక కొడుకుగా మీ తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారు. ఒక తండ్రిగా మీ కొడుకుకి ఎలాంటి సలహాలు ఇస్తారు?
మీ మనసు మాట వినాలని చెప్తా. ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వను.