హాలియా, తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 11 : కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పదవిలో ఉన్నప్పుడే ఏం చేయలేదని, ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. 17 ఏండ్లు మంత్రిగా, 35 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నా రు. అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధిని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎట్ల చేస్త్తడో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. ఆదివారం తిరుమలగిరి (సాగర్) మండలం నెల్లికల్, తదితర గ్రామాల్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డి ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పక్కనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నా కాంగ్రెస్ పాలనలో ఎడుమ కాల్వ ఎండిపోయేదని, ఇక్కడి ప్రజలు తాగడానికి నీళ్లు ఉండేవికావని విమర్శించారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నెల్లికల్ లిఫ్ట్ను మంజూరు చేయించారని గుర్తుచేశారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి.. అధికారం కోసం, స్వలాభం కోసం తాపత్రాయ పడ్డారని.. రైతు సమస్యలపై ఏనాడూ అసెంబ్లీలో ప్రశ్నించలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు విని మోసపోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన నోముల భగత్ను గెలిపించాలని కోరారు.
ఏడాదిన్నరలో నెల్లికల్ లిఫ్ట్: మంత్రి జగదీశ్రెడ్డి
నెల్లికల్ లిప్ట్ను ఏడాదిన్నర కాలంలో పూర్తిచేయిస్తానని, లేదంటే తన పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నెల్లికల్ లిఫ్ట్ ఏర్పాటుపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎత్తిపోతలను పూర్తిచేసి రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. 2014కు ముందు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆకలిచావులు, ఆత్మహత్యలేనని.. మంచినీళ్ల కోసం కిలోమీటర్ల మేర నడిచిపోయిన మహిళలు, కరెంట్ లేక ఎండిపోయిన పొలాలు కనిపించేవని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఆకలి లేదు, ఆత్మహత్యలు లేవు అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నాయకుల తప్పుడు మాటలు నమ్మొద్దని, ఆలోచించి అభివృద్ధి చేసే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, జాజాల సురేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యయాదవ్, ఎంపీపీ ఆంగోతు భగవాన్నాయక్, జడ్పీటీసీ సూర్యబాష్యనాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల కష్టాలు తీర్చింది టీఆర్ఎస్సే : పల్లా
త్రిపురారం: కార్మికుల కష్టాలు తీర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. త్రిపురారంలో ఆదివారం ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు.
కార్మిక, కర్షకులకు అండగా టీఆర్ఎస్ : పోచంపల్లి
కార్మిక, కర్షకులకు టీఆర్ఎస్సే అండగా నిలించిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గతంలో వారిని పట్టించుకునే నాథుడే లేకపోయాడని, రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కార్మికులను ఆదుకుంటుందని తెలిపారు.
కారు స్పీడ్ను జానా తట్టుకోలేరు : మంత్రి తలసాని
తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 11 : సాగర్ ఉప ఎన్నికల్లో కారు స్పీడ్ను జానారెడ్డి తట్టుకోలేరని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తిరుమలగిరి సాగర్ మండలం డొక్కలబాయితండాలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో సాగర్ నియోజకవర్గం ఏ మాత్రమూ అభివృద్ధి జరుగలేదన్నారు. టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్కు మద్దతుగా గౌడ సంఘం కరపత్రం
తిరుమలగిరి (సాగర్), ఏప్రిల్ 11 : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా గౌడ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదివారం నాగార్జునసాగర్లో ఆవిష్కరించారు. గౌడ కులస్థులు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
యూకే లండన్ ఎన్ఆర్ఐల ప్రచారం..
నందికొండ, ఏప్రిల్ 11: సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపును కోరుతూ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యూకే లండన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం 12 మందితో కూడిన బృందంతో ఆదివారం నాగార్జున నందికొండ మున్సిపాలిటీ హిల్కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తమకు కన్నతల్లి లాంటిదని, తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుతున్న టీఆర్ఎస్కు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యూకే లండన్ అధ్యక్షుడు దూసరి అశోక్గౌడ్, కార్యదర్శి గొట్టిముక్కల సతీశ్రెడ్డి, నాయకులు శానబోయిన రాజ్కుమార్, పప్పుల మల్లేశ్, పల్లాల శ్రీనివాస్, రావుల పృథ్వీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో భారీగా చేరికలు
గుర్రంపోడు, నిడమనూరు, ఏప్రిల్ 11 : నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలం కొప్పోలు, మొసంగి గ్రామాలకు చెందిన 350 మంది కాంగ్రెస్ కార్యకర్తలు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. నిడమనూరు మండలం వెంగన్నగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు పొట్టెపాక శ్రీను, పలువురు యువకులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య సమక్షంలో, రేగులగడ్డ గ్రామంలో కాంగ్రెస్కు చెందిన వార్డు సభ్యుడు రమావత్ రాములుతోపాటు 30 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు.