హైదరాబాద్ : బడుగు బలహీనవర్గాల ఆత్మ గౌరవం, సమ సమాజ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఆదివారం 195వ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్ర ఈశ్వర్లతో కలిసి మంత్రి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల నిర్మూలన, సమ సమాజ పునర్నిర్మాణం కోసం మొట్టమొదట పునాదులు వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు. దేశంలో సబ్బండ కులాల సామాజిక మార్పు కోసం తన జీవితకాలాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు.
అనగారిన వర్గాల అభ్యున్నతి తోపాటు అంటరానితనం, లింగ వివక్షతను రూపుమాపేందుకు విశేష కృషి చేశారన్నారు. పూలే ఆశయసాధనకు రాష్ట్ర ప్రభుత్వం మహిళల విద్య ప్రమాణాలు పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, డిఎస్ఓ కిరణ్ కుమార్, వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి రాజేశ్వర్, వివిధ వార్డుల కౌన్సలర్లు తదితరులు పాల్గొన్నారు.