యాదాద్రిలో లడ్డూల తయారీకి భారీ యంత్రాలు

యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి కొండపై పునర్నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు గంటల్లో లక్ష లడ్డూలను తయారు చేసే యంత్ర సామగ్రిని రూ. 8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. మంగళవారం లడ్డూ ప్రసాదాల తయారీకి ఉద్దేశించిన పనులు ప్రారంభించారు. మరో వైపు ఇటీవల వర్షాలకు కుంగిన ప్రాంతాల్లోని కృష్ణశిలలను తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. అనుమతి లేకుండా నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల వద్దకు వెళ్లి ఫొటోలు తీస్తూ పనులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని, వైటీడీఏ అధికారులు పుష్కరిణి సమీపంలో పోలీస్ చెక్పోస్టును ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా యాదాద్రిలో లడ్డూల తయారీకి ముంబయి, పుణె, కోయంబత్తూరులలోని ప్రముఖ పరిశ్రమల్లో అతి పెద్ద బాయిలర్లను తయారు చేయించి ఇటీవల కొండపైకి చేర్చారు. ఈవో గీత, ఈఈ వసంతనాయక్, డీఈ వెంకటేశ్వర్రెడ్డి, డీఈ ఊడెపు వెంకటరామారావు పనులను పర్యవేక్షించారు.