నిర్మల్ టౌన్, ఏప్రిల్ 9 : కొవిడ్ వైరస్ను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నది. కొవిడ్ టీకా వేసుకునేందుకు స్వచ్ఛందంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ పౌరులు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 150 మందికి కొవిడ్ టీకాలను వేశారు. మరో 100 మంది టీకా కొరత కారణంగా వెనుదిరిగి వెళ్లారు. పట్టణంలోని రాంనగర్, బంగల్పేట్ పీహెచ్సీలతో పాటు అన్ని పీహెచ్సీలో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధులు ఉత్సాహం చూపుతూ కొవిడ్ టీకాను వేసుకుంటున్నారు. హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు టీకాను వేసుకొని స్ఫూర్తినిస్తున్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రెండో డోస్ టీకా వేసుకున్నారు. అర్బన్ పీహెచ్సీలో నిర్మల్ పాత్రికేయులు టీకాను వేసుకున్నారు.