నగరానికి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఐసొలేషన్ కోసం ఓయో రూంలను తీసుకోవాలనే ఉద్దేశంతో కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్ సర్చ్ చేశాడు. అందులో లభించిన నంబర్కు ఫోన్ చేయడంతో తాము ఓయో రూమ్స్ కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ సైబర్నేరగాళ్లు మాట్లాడారు. మీరు రూమ్ బుక్ చేసుకోవాలంటే క్విక్ సపోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాధితుడు యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోడ్ చెప్పడంతో సైబర్నేరగాళ్లు బాధితుడికి తెలియకుండానే అతడి సెల్ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తరువాత పలాన ఖాతాకు రూ.వెయ్యి పంపించాలని సూచించారు. బాధితుడు ఆ డబ్బు పంపించగానే బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న సైబర్నేరగాళ్లు ఆయా ఖాతాల నుంచి రూ.3.5లక్షలు కాజేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఫేస్బుక్లో క్రిప్టో కరెన్సీ పేజీలో సురేశ్ పేరుతో పరిచయం అయిన ఓ సైబర్నేరగాడు చంపాపేట్ వాసి నుంచి రూ.3.30లక్షలు కాజేశాడు. బాధితుడికి ఫేస్బుక్లో పరిచయం అయిన సైబర్ నేరగాడు, క్రిప్టోకరెన్సీ ప్రస్తుతం మార్కెట్ ధర కంటే 15శాతం తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. మొదట రూ.10వేలు, ఆ తరువాత రూ.20వేలు పెట్టుబడి పెట్టడంతో నమ్మకంగా క్రిప్టోకరెన్సీని అందించాడు. తర్వాత ఒకేసారి రూ.3లక్షలు పెట్టుబడి పెట్టడంతో సైబర్నేరగాడి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో పక్కా ప్లాన్తో తనను మోసం చేశారని గుర్తించిన బాధితుడు గురువారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.