దేశంలో ఎప్పటికప్పుడు కొత్త రాజకీయ పార్టీలు పుడుతూనే ఉన్నాయి. అందులో అత్యధిక పార్టీలు ఎలాంటి ప్రభావం చూపకుండా అంతర్థ్దానమైపోతున్నాయి. కేవలం పదుల సంఖ్యలో పార్టీలు మాత్రమే దేశ రాజకీయ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నాయి. ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో కేవలం అతికొద్ది మంది మాత్రమే భిన్నమైన వ్యక్తులుగా, అన్నివిధాలా ప్రతిభావంతులుగా నిలుస్తున్నారు. అలాంటి అతికొద్దిమందిలో ఒకరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. తన రాజకీయ జీవితంలో ద్వితీయ భాగాన్ని తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసమే కేటాయించి, ఆ స్వప్నాన్ని సాకారం చేసిన రాజకీయ దురంధరుడు కేసీఆర్.
దక్షిణాది రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఇలా ప్రత్యేక కారణాలతో పార్టీలు స్థాపించినవారు తర్వాత కాలంలో కోట్ల మందిని ప్రభావితం చేసే నేతలుగా ఎదిగారు. తమిళనాడులో ద్రవిడ భావజాలం (హిందూ వ్యతిరేక ఉద్యమం) ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఆవిర్భావానికి దారితీసింది. తెలుగువారి ఆత్మగౌరవమనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భవించింది. మరోవైపు వీటికి ప్రత్యామ్నాయంగా పుట్టుకొచ్చిన పార్టీల వెనుక అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులే కీలక పాత్రధారులు కావడం చెప్పుకోదగ్గ విశేషం. తమిళ సినీరంగాన ఎంతో సమ్మోహన శక్తి కలిగిన ఎంజీ రామచంద్రన్ ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)ను స్థాపించి తమిళనాట ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి వేసిన ముద్ర తదనంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసిందే.
తెలంగాణ విషయానికి వస్తే ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఈ రోజు ఉన్న ప్రజాదరణ, చరిష్మా ఒక్క రాత్రిలో వచ్చినవి కాదు. నిద్రాణమై ఉన్న ప్రత్యేక తెలంగాణ కాంక్షను ఇక్కడి ప్రజల్లో తిరిగి రగిల్చిన వ్యక్తి కేసీఆర్. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, ఎన్నో పోరాటాలకు సిద్ధమై, ఆఖరికి ప్రాణత్యాగానికి కూడా వెనుదీయకుండా ముందుకెళ్లారాయన. 2001 నుంచి 2010 వరకు దాదాపు దశాబ్దకాలంపాటు కేసీఆర్ను ఎన్నో విధాలుగా దెబ్బతీయాలని చూశారు. కేసీఆర్నే కాదు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నే అవహేళన చేశారు. కానీ కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. దెబ్బతిన్న ప్రతిసారి మళ్లీ బలంగా పుంజుకున్నారు. ఆ పోరాట పటిమకు ఢిల్లీ తలవంచింది. తెలంగాణవాసుల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ర్టాన్ని ప్రకటించింది.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్య బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. ఈ ప్రాంతంలో ప్రతి సమస్యను కూలంకషంగా అధ్యయనం చేశారు. ఆయా సమస్యలకు పరిష్కారం ఎలా చూపాలి, తెలంగాణ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై ఓ స్పష్టమైన అవగాహన తెచ్చుకున్నారు. అందుకే 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు ఉద్యమ సమయంలో తానిచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ఆయన బలంగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం గా పేరుబడ్డ తెలంగాణ ఇప్పుడు పచ్చని చీరకట్టు పడుచుపిల్లలా మురిసిపోతున్నదంటే దానికి కారణం ఇక్కడ ప్రతి ప్రాంతానికి జలధారలు అందించేందుకు కేసీఆర్ దూరదృష్టితో వేసిన ప్రణాళికలే. వ్యవసాయం ఒక్కటే కాదు సమాజంలో అన్నివర్గాల వారిని సమానంగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్ అహరహం శ్రమిస్తున్నారు. ఆయన హయాంలో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ జమేదారీగా నిలుస్తున్నది. రైతుకు నీళ్లివ్వడం నుంచి అంకుర సంస్థలకు అనువైన వాతావరణం కల్పించడం వరకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించి, సంపద సృష్టి వైపు శరవేగంగా పరుగులు తీస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొత్త స్వరాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ప్రాంతీయ పార్టీకి చోటుందని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది. అయితే అవకాశవాద రాజకీయాలు చేసే పార్టీలేవీ తమకు మేలు చేసేవి కాదన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. తనకు తాను తెలంగాణవాదినని చెప్పుకొంటున్న వైఎస్ షర్మిల కావచ్చు, కేసీఆర్ ఆశీస్సులతో ప్రఖ్యాతి పొంది, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నిలబడుతున్న వ్యక్తులు కావచ్చు.. వీరెవరివల్లా తెలంగాణకు జరగబోయే మేలేమీ లేదు. చరిష్మాలోగానీ, విశ్వసనీయతలోగానీ ప్రస్తుతం కేసీఆర్కు ఎదురునిలిచే వ్యక్తి తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారా అంటే లేరని బరాబర్ చెప్పొచ్చు.
పాల్వాయి రాఘవేంద్రరెడ్డి