న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: జియో చేతికి ఎయిర్టెల్ స్పెక్ట్రం వచ్చింది. దేశీయ టెలికం రంగంలో నువ్వా-నేనా అన్నట్లుగా ఉన్న ఈ ఇరు సంస్థలు.. ఓ వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ డీల్ విలువ రూ.1,497 కోట్లు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలోని 800 మెగాహెట్జ్ శ్రేణిలోగల కొంత స్పెక్ట్రంను రిలయన్స్ జియోకు భారతీ ఎయిర్టెల్ అమ్ముతున్నది. తక్షణ లావాదేవీ కింద జియో నుంచి రూ.1,037.6 కోట్లను అందుకుంటున్న ఎయిర్టెల్.. భవిష్యత్తు బకాయిల కింద మరో రూ.459 కోట్లనూ పొందుతున్నది. ‘ఏపీ(3.75 మెగాహెట్జ్), ఢిల్లీ(1.25 మెగాహెట్జ్), ముంబై(2.50 మెగాహెట్జ్)ల్లో ఎయిర్టెల్ 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను జియో వినియోగించుకునేలా భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది’ అని మంగళవారం ఎయిర్టెల్ ప్రకటించింది. సంబంధిత అధికారుల అనుమతులకు లోబడి ఈ ఒప్పందం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. కాగా, తమ వద్దనున్న మిగులు స్పెక్ట్రంనే విక్రయించామని ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. మరోవైపు ఈ స్పెక్ట్రం కొనుగోలుతో జియో నెట్వర్క్ సామర్థ్యం మరింత బలపడిందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఆనందం వ్యక్తం చేసింది.