బిజినేపల్లి, ఏప్రిల్2: మండలంలోని గంగారం, కేసరిబండతండా సమీపంలో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ నిర్మాణంతో రైతులకు మహర్దశ రానున్నది. మండలంలోని 5గ్రామాలు, 17తండాల్లోని రైతులకు సాగునీరు, తాగునీరు అందనున్నది. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కాగా గత అసెంబ్లీ సమావేశాల్లో రూ.86కోట్లు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం. మండలంలో కొన్ని గ్రామాలు, తండాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు పంటలు సాగు చేయలేక ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి 2019లో సొంతంగా రూ.లక్ష వెచ్చించి సర్వే కూడా పూర్తి చేయించారు. శాయిన్పల్లి నుంచి గంగారం సమీపంలోని కేసరిబండతండా సమీపంలో మార్కండేయ రిజర్వాయర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గతంలో ఎమ్మెల్యే మర్రి శాయిన్పల్లి నుంచి కేసరిబండ తండా వరకు పొలాల వెంట కార్యకర్తలు, రైతులతో కలిసి పాదయాత్ర కూడా చేశారు.
ఈ రిజర్వాయర్ పూర్తయితే మండలంలోని కేఎల్ఐ కాల్వకు ఎత్తు ప్రాంతంలో ఉన్న గంగారం, లట్టుపల్లి, శాయిన్పల్లి, పోలేపల్లి, మమ్మాయిపల్లి గ్రామాలతోపాటు కేసరిబండ తండా, పెద్దతండా, కీమ్యాతండా, వసూరాంతండా, అలుగుతండా, పెద్దహేముల తండా, ఎర్రకుంటతండా, రావులచెరువు, బద్యతండా, ఇప్పలతండా, బోర్సుగడ్డతండా, పుల్సింగ్తండా, చిన్నపీరు తండా, భీమునితండా, నీర్లగడ్డతండా, శాయిన్పల్లితండాల రైతులకు కేఎల్ఐ, కృష్ణాజలాలు పుష్కలంగా అంది పొలాలు సస్యశ్యామలం కానున్నాయి. గతంలో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఇరిగేషన్ అధికారులతో సర్వేలు కూడా నిర్వహించారు. 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మార్కండేయ రిజర్వాయర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయడంతోపాటు నిధులు మంజూరు చేశారు.
సస్యశ్యామలం కానున్న మండలం
మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే మండలం సస్యశ్యామలం కానున్నది. గతంతో కేఎల్ఐ కాలువ పైభాగాన ఉన్న రైతులు తమకు సాగునీరందించాలని విన్నవించగా సొంత డబ్బులతో సర్వే చేయించాను. దీంతో అసెంబ్లీలో రిజర్వాయర్కు నిధులు ప్రకటించారు. సంవత్సరంలో రిజర్వాయర్ పూర్తి చేయిస్తాం. మార్కండేయ రిజర్వాయర్ పూర్తిచేసి కృష్ణమ్మ నీటితో రైతులకు సాగునీరందిస్తాం.