బెంగళూర్ : భార్య ప్రియుడిని చంపేందుకు ఓ వ్యక్తి మంచం కింద ఆరుగంటల పాటు దాక్కుని ఆపై అతడిని దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం బెంగళూర్లోని ఆంధ్రాహళ్లి ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. నిందితుడిని రోహిత్నగర్లో నివసించే కార్పెంటర్ భరత్కుమార్గా గుర్తించారు. భరత్ భార్య ప్రేమికుడిని చిక్మగుళూర్ జిల్లా హోషళ్లికి చెందిన శివరాజ్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ భర్త బుధవారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకూ మంచం కింద కాపుకాశాడు. ఆపై భార్య ప్రియుడిని కత్తిపోట్లతో హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భరత్, వినుతలకు ఎనిమిదేండ్ల కిందట వివాహమైంది. ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వినుత గ్రామానికి చెందిన శివరాజ్ ఉద్యోగాన్వేషణ కోసం మూడేండ్ల కిందట వీరి ఇంటికి వచ్చాడు.
వారింట్లోనే వారం రోజులు మకాం వేశాడు. ఆపై శివరాజ్ను వినుత పనిలో కుదిర్చింది. ఈ క్రమంలో మాయమాటలతో శివరాజ్ వినుతను లోబరుచుకున్నాడు. భార్య వ్యవహారం పసిగట్టిన భరత్ తమ సంసార జీవితంలో నిప్పులు పోసిన శివరాజ్ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇక భర్తను విడిచి ఆంధ్రాహళ్లి ప్రాంతంలో ఉంటున్న వినుత వద్దకు శివరాజ్ వచ్చిపోతుండటం చూసి భరత్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఇక ఆన్లైన్లో కత్తిని కొనుగోలు చేసిన భరత్ మంగళవారం రాత్రి భార్య చికెన్ కొనేందుకు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక రాత్రి సమయంలో వినుత ఇంటికి శివరాజ్ రాగా డిన్నర్ అనంతరం ఆమె వాష్రూమ్కు వెళ్లిన క్రమంలో తలుపులు మూసివేసిన భరత్ శివరాజ్పై కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.