మిఠాయిలు పంచుకున్న ఉద్యోగులు
కలెక్టరేట్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగుల క్షీరాభిషేకం
కలెక్టర్కు మిఠాయి తినిపించిన సంఘాల నాయకులు
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 22: సీఎం కేసీఆర్ శాసన సభలో పీఆర్సీని ప్రకటించడంతో జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబురాలు చేశారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏ బ్లాక్ నుంచి ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముఖద్వారం వద్ద ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు కోరుకున్న విధంగా సీఎం కేసీఆర్ 30 శాతం పీఆర్సీని ప్రకటించారని సంతోషం వ్యక్తం చేశారు. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం వర్తిస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. పీఆర్సీ వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలు కానున్నదని వారు హర్షం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ దారులకు కుటుంబ పెన్షన్గా చెల్లిస్తారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ద్వారా ఉద్యోగులు గౌరవంగా పనిచేసుకునే పరిస్థితి కల్పించినందుకు మరోసారి సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ హనుమంతరావును టీఎన్జీవో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మిఠాయి తినిపించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు ఉద్యోగ సంఘాల నాయకులు మిఠాయిలు తినిపించారు. కార్యక్రమంలో టీజీవో, టీఎన్జీవో నాయకులు వైద్యనాథ్, సుశీల్బాబు, శ్రీనివాస్ ఉన్నారు.
పీఆర్టీయూ ఆధ్వర్యంలో..
స్థానిక ఐబీ వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో సంబురాలు చేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాణయ్య మధన్గోపాల్ మాట్లాడుతూ అసెంబ్లీలో పీఆర్సీని ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ టీజీవో, టీఎన్జీవో సంఘాలతో పాటు పీఆర్టీయూ ఎమ్మెల్సీల పేర్లను ప్రస్తావించడంతో పీఆర్టీయూపై ముఖ్యమంత్రి అభిమానం మరోసారి రుజువైందని సంతోషం వ్యక్తం చేశారు. 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వడాన్ని ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు రఘురంజన్, సురేందర్, యాదగిరి, రాజు, మోహన్రెడ్డి, దామోదర్, భీమయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.