ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
పుల్కల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
పుల్కల్,మార్చి 21: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్థానిక సంస్థలకు పెద్దపీట వేశారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రం పుల్కల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్థానిక సంస్థలకు రూ.500కోట్లు కేటాయించడం స్వాగతించాల్సిన విషయమన్నారు. దీంతో స్థానిక సంస్థలు బలోపేతమవడమే కాకుండా గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు ఏర్పడుతాయని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం వల్ల పట్టభద్రుల్లో టీఆర్ఎస్పై విశ్వాసం సడలలేదని రుజువైందని తెలిపారు.
టీఆర్ఎస్ హయాంలో క్రీడలకు ప్రాధాన్యత
అందోల్, మార్చి 21: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ గ్రామీణస్థాయి క్రీడాకారులు సైతం జాతీయస్థాయికి ఎదిగే విధంగా తగిన ప్రోత్సాహం అందిస్తున్నామని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం జోగిపేటలో అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య సతీమణి మాణెమ్మ స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని దీంతో జాతీయస్థాయిలో మన ప్రాతినిధ్యం పెరుగుతున్నదన్నారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించి మనిషికి ఎంతో ఉల్లాసాన్నిస్తాయన్నారు. గెలుపోటములను పక్కనపెట్టి క్రీడాకారులు స్నేహపూరిత వాతావరణంలో ఆటలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాహుల్ కిరణ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్గుప్తా, మాజీ చైర్మన్ నాగభూషణం, ఎంపీపీ బాలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు లక్ష్మీకాంత్రెడ్డి, వెంకటేశం, తాలెల్మ సర్పంచ్ లింగాగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జగన్నాథం కుటుంబాన్ని ఆదుకుంటాం
పుల్కల్ రూరల్, మార్చి 21: పంచాయతీ కార్యదర్శి జగన్నాథం కుటుంబాన్ని అన్ని రకాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గతవారం ఆత్మహత్య చేసుకున్న పుల్కల్ మండలం మిన్పూర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇసోజీపేటలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్య పడకండి మీకు అండగా నేనుంటా.. ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉద్యోగం పొందిన జగన్నాథం మృతిచెందడం తనను కలిచి వేసిందన్నారు. ప్రతి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు సహజమని వాటిని తట్టుకుని ముందుకెళ్లాలి తప్పా ఇలాంటి నిర్ణయాలు తీసుకోద్దన్నారు. విధుల నిర్వహణలో సమస్యలు ఏవైనా ఉంటే పై అధికారులకుగానీ…లేదా నా దృష్టికి తీసుకురావాలని ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. ఇటీవల మొసలి దాడిలో మృతిచెందిన గొల్ల రాములును ఆర్థికంగా ఆదుకుంటామని హామీనిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు శివకుమార్, రైతుబంధు అధ్యక్షుడు నర్సిహారెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు మాణిక్రెడ్డి, నాయకులు విజయ్భాస్కర్రెడ్డి ఉన్నారు.