23 అడుగులతో రామకోటి స్తూపం
పదకొండు కోట్ల రామకోటి ప్రతులతో ప్రతిష్ఠిస్తాం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ద్విమండల కాలం పాటు, అఖండ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించామని, ప్రతి ఇంట్లోను హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని ఎమెల్సీ కవిత పిలుపునిచ్చారు. కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణం, రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించుకోవడంతోపాటు 11 కోట్ల రామకోటి ప్రతులను రాయాలన్న మహ సంకల్పాన్ని తీసుకున్నప్పుడే అంజన్నపై భారం వేసినట్లు చెప్పారు. “హనుమంత.. మేమెంత.. నీముందు.. అణువంత.. నీవు జగమంత.. నీదే తండ్రి భారం అని” ధ్యానించామని, అంజన్న దయతో రెండు మండలాల కాలం పాటు రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఝురి ఆవహించే పరిస్థితి సాకారమైందని చెప్పారు. అఖండ హనుమాన్ చాలీసా పారాయణాన్ని కొండపై ప్రారంభిస్తున్నామని చెప్పగానే రాష్ట్రంలోని పదివేల ఆలయాల్లోని స్వామి భక్తులు ప్రతి రోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల మధ్య పారాయణం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు. అలాగే భక్తిభావం, ఆధ్యాత్మిక భావం ప్రతి గడపకు వెళ్లాలని, ప్రతి మదిని తాకాల్సిన అవసరం ఉందన్నారు. 23 అడుగుల ఎత్తుతో రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ఆరంభమయ్యాయని చెప్పారు. రూ.90 లక్షలు మంజూరయ్యాయని, స్థపతి రామకోటి స్తూపం నమూనాను సిద్ధం చేసి, స్థల పరిశీలన పూర్తి చేశారన్నారు. జూన్ 4న 11 కోట్ల రామకోటి ప్రతులతో రామకోటి స్తూపాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించుకోనున్నట్లు చెప్పారు.