బడంగ్పేట, మార్చి16: మహేశ్వరం నియోజక వర్గంలో పేదల సొంతింటి కల త్వరలో నెరవేరనున్నది. అర్హులైన ప్రతి పేదవాడికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం వేగంగా పనులు చేయిస్తున్నది.అందులో భాగంగా నియోజకవర్గం వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కొన్ని చోట్ల పనులు పూర్తికాగా మరి కొన్ని చోట్ల చివరి దశకు వచ్చాయి. మూడు నెలల్లో ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
నియోజక వర్గం వ్యాప్తంగా రూ.794.58 కోట్లతో 66 ఎకరాల్లో 10,216 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు జోరుగా సాగుతున్నాయి. మంఖాల్, సర్ధార్ నగర్, కుర్మల్గూడలో ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశారు. మన్సాన్పల్లి, మల్లాపూర్, మీర్పేటలోని లెనిన్నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మల్లాపూర్లో 14 ఎకరాల్లో రూ. 250 కోట్లతో 25 బ్లాకులలో 2700 ఇండ్లు, ముంఖాల్లో 12 ఎకరాల్లో రూ. 150 కోట్లతో 19 బ్లాకులలో 2,016 ఇండ్లు పూర్తి చేశారు. మొహబ్బత్ నగర్ 3 ఎకరాల్లో రూ. 36 కోట్లతో 4 బ్లాకుల్లో 396 ఇండ్లు త్వరలో పూర్తి చేయిస్తామని పేర్కొంటున్నారు. మన్సాన్ పల్లిలో 10 ఎకరాల్లో రూ.150 కోట్లతో 19 బ్లాకుల్లో 2,412 ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సర్ధార్ నగర్లో 9.5 ఎకరాల్లో రూ.53.14 కోట్లతో 26 బ్లాకుల్లో 880 ఇండ్లు పూర్తి చేశారు. కుర్మల్ గూడలో 14.5 ఎకరాల్లో రూ.91.44 కోట్లతో 48 బ్లాకుల్లో 1536 డబుల్ ఇండ్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. మీర్పేటలో 3 ఎకరాలలో రూ.14కోట్లతో 276 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం దశలో ఉన్నాయి. డబుల్ బెడ్రూం సముదాయాల దగ్గర సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల, కమ్యూనిటీ హాల్స్, పార్కులు ఏర్పాటు చేయిస్తున్నారు. కృష్ణ వాటర్ కోసం ముందే ట్యాంక్లను ఏర్పాటు చేశారు. పిల్లలు చదువుకోవడానికి స్కూల్, ఆడుకోవడానికి ఆహ్లాదంగా పార్కులను ఏర్పాటు చేస్తున్నారు.
అర్హులైన ప్రతి పేద వాడికీ డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తాం. ఇప్పటికే కొన్ని చో ట్ల ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు. మరి కొన్ని చోట్ల త్వరలో పనులు కొనసాగుతున్నాయి. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క రికీ న్యాయం చేస్తాం. తప్పుడు ప్రచారం చేస్తున్న వారి మా టలను నమ్మొద్దు. -మంత్రి సబితా ఇంద్రారెడ్డి