గ్రామాల్లో పారిశుధ్య లోపం తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలి

కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు అధికారులు పనిచేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. స్థానిక పశు సంవర్థ్ధక శాఖ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలతో కలెక్టర్ శుక్రవారం సమావేశమై గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పనులన్నీ నూరుశాతం పూర్తి చేసి జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు. పారిశుధ్య చర్యలు కేవలం పల్లెప్రగతి కార్యక్రమాల్లో చేపట్టి, వదిలి వేయకుండా నిరంతర ప్రక్రియగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వార్డుల వారీగా రోజు వారి మురుగు కాల్వల శుభ్రత, రోడ్లు శుభ్రపరచడంపై రోజు వారి నివేదికలు పంచాయతీ కార్యదర్శుల ద్వారా జిల్లా పంచాయతీ అధికారికి అందాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో డంపింగ్యార్డులు, శ్మశాన వాటికల ఏర్పాట్లు యుద్ధ్ద ప్రాతిప్రదికన పూర్తి చేయాలని ఆదేశించారు. డంపింగ్యార్డుల విషయాల్లో చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. కేవలం తీర్మాణాలకే పరిమితం కాకుండా ట్రాక్టర్లను డాక్యుమెంటేషన్, కొనుగోలు ఆర్డర్లు జారీ చేసి వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. డంపింగ్యార్డులు, శ్మశాన వాటికల విషయాల్లో తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు రోజు వారి సమన్వయంతో చర్చించి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో డీఆర్డీవో ఉపెందర్రెడ్డి, డీపీవో జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.