దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో మను సాహ్నీని సెలవుపై పంపించారు. ఐసీసీలోని సభ్య దేశాలు, ఉద్యోగులతో ఆయన ప్రవర్తన సరిగా లేదని విచారణ జరిపిన ప్రైస్వాటర్హౌజ్కూపర్స్ తేల్చి చెప్పడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో సామ్నీ పదవీకాలం ముగియనుండగా.. ఆలోపే ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. 2019 వరల్డ్కప్ తర్వాత డేవ్ రిచర్డ్సన్ నుంచి బాధ్యతలు అందుకున్న సాహ్నీ.. అప్పటి నుంచీ అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఐసీసీని కూడా శాసించగలిగే సామర్థ్యం ఉన్న బీసీసీఐ ఆయన తీరుపై గుర్రుగా ఉంది.
ఐసీసీ ఈవెంట్లు నిర్వహించే దేశాలు ఫీజు చెల్లించాలన్న సాహ్నీ ప్రతిపాదనను బీసీసీఐతోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేకాకుండా ఐసీసీ చైర్మన్ పదవికి న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లేను ఈ బోర్డులు ప్రతిపాదించగా.. సాహ్నీ మాత్రం తాత్కాలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు మద్దతు తెలిపారు. ఇక ప్రతి ఏటా ఐసీసీ ఒక టోర్నీ నిర్వహించాలన్న సాహ్నీ ప్రతిపాదన కూడా ఈ మూడు బోర్డులకు రుచించలేదు. ఇలా ఐసీసీ సమావేశాల్లో చాలా వరకూ సాహ్నీ తీరుపై ఈ మూడు పెద్ద బోర్డులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను సెలవుపై పంపించింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే.. తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభించే అవకాశం ఉంది.