రేసులో అశోక్ లేల్యాండ్, ఎంఅండ్ఎం, భారత్ ఫోర్జ్, మేఘా ఇంజినీరింగ్ కూడా
న్యూఢిల్లీ, మార్చి 8: రక్షణ, నిర్మాణ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీలో ఎంతో ఖ్యాతి పొందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)లో 26% ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయాలని టాటా మోటర్స్, అశోక్ లేల్యాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. వీటితోపాటు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూడా బీఈఎంఎల్లో వాటా కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వానికి బీఈఎంఎల్లో 54.03 శాతం వాటా ఉన్నది. దీనిలో 26% వాటాను అమ్మేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) జనవరిలో ఈఓఐ బిడ్లను ఆహ్వానించింది. కేంద్రం తరఫున ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిర్వహించేందుకు ఎస్బీ ఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థను ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా నియమించింది. ఈఓఐ బిడ్లను మార్చి 1లోగా దాఖలు చేయాలని తొలుత నిర్దేశించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత ఈ గడువును ఈ నెల 22 వరకు పొడిగించింది.