సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు మల్లన్న క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలో భక్తులు మల్లన్న దర్శనంతో పరవశం చెందుతున్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు మల్లన్న స్వామి ..మమ్మేలు స్వామి అనే నినాదాలతో మల్లన్న క్షేత్రం మార్మోగిపోయింది.
8వ ఆదివారం సందర్భంగా 35వేల మందికి పైగా భక్తులు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్ర లేచి కోనేరులో పవిత్ర స్నానం ఇచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో 4 గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు.