ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. పక్కా ప్రణాళికతో 3400 టీఆర్ఎస్ వారియర్స్, 50 ఓటర్లకు ఒక కమిటీని ఏర్పాటు చేసిన జిల్లాలోని 1, 53, 383 మంది ఓటర్లను చేరుకునేలా కార్యాచరణకు ముందుకు వెళుతున్నది. హైదరాబాద్ ఎన్నికల ఇన్చార్జి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గురువారం మినిస్టర్ క్వార్టర్స్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల, డివిజన్ స్థాయి ఇన్చార్జిలు, ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, హోంమంత్రి మహమూద్ ఆలీతో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం మంత్రి గంగుల కమలాకర్, మంత్రి తలసానికి శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణీదేవితో కలిసి సనత్నగర్ నియోజకవర్గంలోని శ్యామలకుంట పార్కులో ఉదయం వాకర్స్ను కలిసి వాణీదేవిని గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. అక్కడికి సమీపంలోని సంజీవరెడ్డినగర్లో సీనియర్ సిటీజన్స్ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బేగంపేట ఎయిర్లైన్స్ కాలనీలో పట్టభద్రులతో నేరుగా మంత్రి గంగుల వాణీదేవి అభ్యర్థిత్వానికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. గన్ఫౌండ్రీ డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్కాలనీ పార్కులో,ముషీరాబాద్లోని కశిష్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా విజ యం సాధించేలా ప్రణాళికాబద్ధ్దంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులను ఏనాడు పట్టించుకోని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్రావుకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.మోడీ ప్రభుత్వం వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందన్నారు.
అభివృద్ధి కొనసాగేందుకు టీఆర్ఎస్ను గెలిపించాలని వాణీదేవి అన్నారు. విద్యారంగంలో 35 సంవత్సరాల అనుభవం ఉందని, తనను గెలిపిస్తే మీ గొంతుకను అవుతానని ఆమె అన్నారు. పీవీ కూతురుగా ప్రజా సేవ చేసేందుకే ఎమ్మెల్సీ బరిలో నిలిచానని ఆమె అన్నారు. ఆదరించి ఆశీర్వదించి శాసన మండలికి పంపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎన్నికల్లో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం షీటీమ్స్ను ఏర్పాటు చేసిందన్నారు. మహిళల వాణిని వినిపించే అవకాశం కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అనే పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కవులు, కళాకారులకు గుర్తింపు వచ్చిందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన కొనసాగుతూ ట్రెండ్ సృష్టిస్తుంటే మరోవైపు దేశాన్ని అమ్మేస్తూ బీజేపీ దగా చేస్తుందని మంత్రి గంగుల దుయ్యబట్టారు. ప్రతిభను గుర్తించడంలో ముందుండే సీఎం కేసీఆర్ నేడు పీవీ కుమార్తె, ఉన్నత విద్యావంతురాలు మచ్చలేని వ్యక్తి సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా పంపించడానికి సంసిద్ధులై విషయాన్ని విద్యావంతులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఆరేండ్లలో అద్భుత ప్రగతిని సాధించిన తెలంగాణ అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో లక్షలాది ఉద్యోగాలను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు.
శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు సురభి వాణీదేవికి వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్,బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు తెలంగాణ ప్రజలకు చేసిన సేవ ఏమి లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు. బీజేపీ కల్లబొల్లి మాటలను నమ్మొద్దని సూచించారు. సీఎం కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు.