యాదాద్రి భువనగిరి, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర రాజధానికి చేరువగా ఉన్న జిల్లాలో రియల్ వ్యాపారం జోరుమీద ఉంది. పట్టణాలకు సమీపంలో.. ప్రధాన రహదారుల వెంట ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలోనే గత నాలుగైదేండ్లలో వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇంకా వెలుస్తున్నాయి కూడా. అయితే రియల్టర్లు వెంచర్ల ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోవడం లేదు. ఇవేవీ పరిశీలించకుండానే ప్లాట్లను కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణ సందర్భంలో అనుమతులు రాక.. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక చిక్కుల్లో పడుతున్నారు. జిల్లాలో భువనగిరితో పాటు కొత్తగా చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, భూదాన్పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. కొన్ని మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు సైతం విలీనమయ్యాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్న సందర్భంలో ఏర్పాటు చేసిన వెంచర్లకు అప్పట్లో అనుమతులు తీసుకున్నప్పటికీ మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత కూడా వాటికి మరోసారి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అలా ఎవ్వరూ తీసుకోకపోవడంతో మున్సిపల్ అధికారులు సంబంధిత వెంచర్లను అక్రమ లే అవుట్లుగా పరిగణించారు. వైటీడీఏ, హెచ్ఎండీఏ, డీటీసీపీవోల నుంచి అనుమతులు పొందిన వెంచర్లు జిల్లాలో వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉండగా.. ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అక్రమ వెంచర్లను ఇదివరకే సంబంధిత అధికారులు గుర్తించారు.
గత యేడాది క్రమబద్ధీకరణకు అవకాశం
అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లను అమ్ముకుని రియల్టర్లు చేతులు దులుపుకోగా.. అమాయక ప్రజలు ఆ ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోతున్నారు. వీరి పరిస్థితిని చూసి ప్రభుత్వం అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని గతంలో ఎన్నోసార్లు కల్పించింది. దరఖాస్తుదారులు నిర్ణీత రుసుం చెల్లించి క్రమబద్ధీకరణతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా.. చాలా మంది ముం దుకు రాలేదు. పలుమార్లు గడువు ఇచ్చినా పలు కారణాలతో క్రమబద్ధీకరించుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో కొత్త మున్సిపాలిటీల్లో మరోసారి అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం తేదీ. 25/5/2020న జీవో నంబర్: 77ను విడుదల చేసింది. ఆ ప్రకారంగా..కొత్త మున్సిపాలిటీలు, విలీన గ్రామాల పరిధిలో 2018 మార్చి 30వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. అప్పట్లో మేళాలు నిర్వహించి సైతం అధికారులు అవగాహన కల్పించినప్పటికీ ఎల్ఆర్ఎస్ పథకానికి ఆశించిన మేరలో దరఖాస్తులు రాలేదు. రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా స్లాబ్ ధరలో 14 శాతాన్ని చెల్లించాలని జీవో నంబర్: 131లో సవరణలు చేయడంతోపాటు, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసేందుకు చెల్లించాల్సిన నాలా చార్జీలను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా పేద, మధ్యతరగతి వర్గాల వారికి ఉపశమనం కల్పించింది. దీనివల్ల చార్జీలు తగ్గడంతో అక్టోబర్ నెలాఖరు గడువు నాటి అంచనాలకు మించి 54,649 దరఖాస్తులు వచ్చాయి.
15 రోజుల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. వచ్చిన దరఖాస్తులను గ్రామ పంచాయతీలు, కాలనీల ప్రాతిపదికన క్లస్టర్ల వారీగా విభజించే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడిన బృం దాలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించనున్నా యి. అర్హత ఉన్నవి, లేనివీ గుర్తించి బృందం సభ్యులు జిల్లా కలెక్టర్కు, సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు నివేదిక ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ అంతా 15 రోజుల్లో పూర్తి కానుంది. ఆ తర్వాత ఆ నివేదికలు ప్రభుత్వానికి పంపి పూర్తిగా ఫీజుల చెల్లింపులు పూర్తయ్యాక…ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాల ప్రకారం ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నారు.