చందంపేట మండలంలోని రైతులు వర్షాలపై ఆధారపడకుండా తుంపర సేద్యానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడంతో బోర్లు వేసుకుని సబ్సిడీపై స్ప్రింక్లర్లు, పైపులు కొనుగోలు చేశారు. ఏటా పత్తి, వేరుశనగ సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు.
ఒక్కడితో మొదలై..
చందంపేట మండలం బుడ్డోని తండాకు చెందిన నేనావత్ రాములు ఐదెకరాల్లో మూడేండ్లుగా పత్తి, వేరుశనగ సాగు చేస్తున్నాడు. పొలంలో బోరు వేయడంతో పుష్కలంగా నీళ్లుపడ్డాయి. తుంపర పద్ధతిలో పంటకు నీరందించడంతో మంచి దిగుబడి సాధిస్తున్నాడు. దీంతో రాములును స్ఫూర్తిగా తీసుకున్న మరో 60మందికి పైగా రైతులు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకున్నారు. 15రోజుల కిందట విత్తనాలు వేసిన రైతులు రెండు రోజుల కిందటి వరకూ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించారు. వర్షాలు కురుస్తుండడంతో వాటిని నిలిపేశారు. ఈ పద్ధతి ద్వా రా మొక్కలు ఎండిపోకుండా మంచి దిగుబడి కూడా వస్తుందని, ఎకరానికి 15క్విం టాళ్ల పత్తి, 12క్వింటాళ్ల వేరు శనగ దిగుబడి రావడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతున్నట్లు రైతులు తెలిపారు.
మూడేండ్లుగా స్ప్రింక్లర్లతోనే సాగు…
రాష్ట్ర ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏటా రెండు పంటలు సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ప్రైవేటు అప్పులు లేకుండా దర్జాగా జీవనం గడుపుతున్నామని రైతు రాములు తెలిపాడు. స్ప్రింక్లర్లను సైతం ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుండటంతో తమకు వరంలా మారిందని చెప్పాడు.
స్ప్రింక్లర్లతో సాగుపై రైతుల్లో ఆసక్తి..
చందంపేట, నేరెడుగొమ్ము మండలాల రైతులు స్ప్రింక్లర్లతో సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నా రు. ప్రభుత్వం సబ్సిడీపై పరికరాలు అందిస్తుండడంతో పైపులు, సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. గతంలో వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులంతా నేడు తుంపర సేద్యంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
– శివరాంకుమార్,ఏవో, నేరెడుగొమ్ము