నేరేడుచర్ల, జూలై 19: ప్రస్తుత సీజన్లో పశువులకు గొంతు వాపు వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పశువులను కాపాడుకోవచ్చు. ఒకవేళ వ్యాధి బారిన పడినా లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స చేయించాలని, లేని పక్షంలో మృత్యువాత పడే ప్రమాదం ఉందని పశు వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
వ్యాధి వ్యాప్తి ఇలా..
గొంతువాపు వ్యాధి ప్రధానంగా బర్రెలు, దున్నల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. ఆవులు, దూడల్లో కాస్త తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, వర్షంలో తడిసినప్పుడు, ఎండి గడ్డితో పాటు పచ్చిగడ్డి మేసిన పశువులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బురద ప్రదేశాల్లో తిరిగినప్పుడు వ్యాధి మరింతగా వేగంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువులు మేత కూడా సరిగా మేయవు. నీరసించి కనిపిస్తాయి.
ఒక దానినుంచి మరో దానికి
వ్యాధిగ్రస్తమైన పశువులు తాగిన నీటిని వేరే పశువులు తాగినా, వాటి సమీపంలో ఉన్నా ఒక దాని నుంచి మరొక పశువుకు అంటుకునే అవకాశం ఉంటుంది. హెమరాజిస్ సెప్టిమ్, పెస్టెరెళ్లా మల్డోఫెడ్ వంటి బ్యాక్టీరియాలు పశువుల శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులపై ప్రభావం చూపడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అందుకు దీనిని పచ్చికొమ్మ అని కూడా అంటారు. వ్యాధి బారిన పడిన పశువులు నోరు తెరిచి శ్వాసించడం వల్ల గురక వస్తుంది.
వ్యాధి లక్షణాలు
గొంతు వాపు వ్యాధి సోకిన పశువుల్లో దవడల మధ్య గొంతు పైన, మెడ కింది భాగాల్లో రక్తం మరకలు కనిపిస్తాయి. కళ్లు ఎర్రగా మారి నీళ్లు కారుతుంటుంది. పశువులు ఆయాసంతో ఎగశ్వాస పీలుస్తూ శబ్దం చేస్తుంటాయి. వ్యాధి తీవ్రమైనప్పుడు జ్వరంలో ఆకస్మికంగా చనిపోతాయి. పశువులు మేత సరిగా మేయక పోయినా, అలసటగా కనిపించినా, నాలుక బయటకు పెట్టి ఇబ్బంది పడుతున్నా వెంటనే చికిత్స చేయించాలి.
సకాలంలో చికిత్స
వ్యాధి లక్షణాలు కనిపించిన పశువులను వెంటనే దగ్గరలోని పశువైద్య శాలకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. వ్యాధి సోకిన వాటిని మిగితా పశువులతో కలువనివ్వకుండా జాగ్రత్త పడాలి. పాకలను శుభ్రంగా ఉంచి, తరుచూ క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి. ఈ పశువులు తిని మిగిలిన గడ్డిని కాల్చి వేయాలి. మలమూత్రాలను గుంత తీసి పూడ్చి పెట్టాలి. ఒక వేళ వ్యాధితో పశువు చనిపోతే దాని కళేబరాన్ని తోతైన గుంతలో పాతిపెట్టాలి.
జాగ్రత్తలు పాటించాలి
పశువుల పెంపకందారులు పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. పశువులను గమనిస్తూ ఉండాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దానిని గుర్తించి చికిత్స ప్రారంభించాలి. ఏ వ్యాధి సోకినా సరే సమీపంలోని పశు వైద్యాధికారిని సంప్రదించి ఆయన సూచనలు మేరకు మందులను వాడాలి.
-మేకల శంకర్రావు, అసిస్టెంట్ డైరెక్టర్, పశువైద్యశాల, నేరేడుచర్ల