యాదగిరిగుట్ట రూరల్, జూలై16: యాదాద్రీశుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను భక్తులు వైభవంగా నిర్వహించారు. లక్ష్మీదేవిని విశేష పుష్పాలతో అలంకరించారు. బాలాలయ ముఖమండపంలో స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారి ని బాలాలయ ముఖమండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కొనసాగాయి. అష్టోత్తర పూజల్లో భక్తు లు పాల్గొన్నారు. స్వామి వారికి ఆయా విభాగాల నుంచి రూ. 5,77,889 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్
లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థాన అధికారులు ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనం అందజేశారు.
మహాద్భుతంగా ఆలయ పునర్నిర్మాణ పనులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు మహాద్భుతంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పేర్ని నాని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదాన్ని అందజేయగా అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయన యాదాద్రి ప్రధానాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చేయిస్తున్నారని కొనియాడారు. ఇంతటి గొప్పగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నందుకు సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తాను యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల గురించి చాలా గొప్పగా విన్నానని, ఇప్పుడు స్వామి వారిని దర్శించుకుని కనులారా నిర్మాణాలను చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవుడి ఆశీస్సులతో ఆలయ పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందన్నారు.