నేడు హాలియాకు సీఎం కేసీఆర్
ముచ్చటగా మూడోసారి రాక
నాగార్జునసాగర్ నియోజకవర్గంపై ప్రగతి సమీక్ష
ఉప ఎన్నికల హామీల అమలే ప్రధాన ఎజెండా
ఉదయం 10:40కి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్న ముఖ్యమంత్రి
హాలియా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాట్లు పూర్తి
3 వేల మంది ప్రతినిధులు, అధికారులకు అనుమతి
రెండు గంటలపాటు సమావేశం
ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు సన్నద్ధం
హాలియా, ఆగస్టు 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రానున్నారు. ఉపఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ప్రగతి సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం హాలియా లోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాట్లు పూర్తి చేయగా 3 వేల మంది ప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులతోపాటు అధికారులను అనుమతించనున్నారు. ఉదయం 10:40 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ హాలియాకు చేరుకొని ప్రత్యేక బస్సులో సమావేశ స్థలానికి వెళ్లనున్నారు. ఈ మార్గంలో ప్రజలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. నాగార్జునసాగర్కు సీఎం కేసీఆర్ ఐదు నెలల్లో మూడోసారి వస్తున్నారు. అభివృద్ధి పనులతోపాటు పలు సమస్యలను పరిష్కరించనున్నారు.
హాలియాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు కలిపి సుమారు 3వేల మంది పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా ప్రజలపై వరాల జల్లు కురిపిస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు తమ అభిమాన నాయకుడి రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గడిచిన ఐదు నెలల్లో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
హామీల అమలు కోసమే రాక..
నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థి నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, భగత్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 రోజుల్లో మళ్లీ నేను నియోజకవర్గానికి వచ్చి ఇక్కడే కూర్చొని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి రావాల్సి ఉన్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య పెరిగిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దాంతో సీఎం కేసీఆర్ రాలేకపోయారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హాలియాకు వస్తున్నారు. ప్రగతి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ గత ఉప ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశం నిర్వహణ కోసం హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం అధికారులు హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో హాలియాకు చేరుకుంటారని, హెలిప్యాడ్ నుంచి కారులో ఎమ్యెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకుంటారని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రగతి సమీక్షా సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర బారికేడ్లు కట్టారు. హాలియాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
నియోజకవర్గానికి రావడం మూడోసారి
గడిచిన ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి రావడం ఇది ముచ్చటగా మూడోసారి. మార్చి 9న నెల్లికల్లుతోపాటు జిల్లాలో 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుముల మండలం అలీనగర్ సమీపంలో ఏర్పాటు చేసిన రైతు ధన్యవాద సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయాన్ని కాంక్షిస్తూ ఏప్రిల్ 14న హాలియా వద్ద జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ రెండు సభలతోపాటు గత శాసన సభ ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు నేడు మరోసారి హాలియాకు వస్తున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించే అవకాశం
ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంది. తాగు, సాగునీటితోపాటు పోడు భూముల సమస్య, ఎన్ఎస్పీ క్వార్టర్స్ రెగ్యులరైజ్, కాల్వ చివరి, బీడు భూములకు సాగునీరు అందించడం, హాలియాలో మినీ స్టేడియం నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, షాదీఖానా ఏర్పాటు, అంతర్గత రోడ్లు, పలు వాగులు, వంకలపై వంతెనల నిర్మాణం, హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలకు అప్గ్రేడ్ చేయడం తదితర సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గంలో డ్రైనేజీలు, కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
3 వేల మందికి అవకాశం..
సమీక్షా సమావేశంలో జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు కలిపి సుమారు 3 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, సింగిల్విండో చైర్మన్, డైరెక్టర్లు, దేవస్థాన కమిటీ చైర్మన్, పాలకమండలి సభ్యులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, మండల కన్వీనర్లు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొననున్నారు. వీరికి ఎంట్రీపాస్తోపాటు ఐడీ ప్రూఫ్ ఉంటేనే పోలీసులు సభా ప్రాంగణంలోకి అనుమతించనున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
హెలికాప్టర్ ద్వారా ఉదయం 10.40 గంటలకు హాలియాకు చేరుకుంటారు.
10.55 గంటలకు హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రగతి సమీక్షా సమావేశం ప్రారంభం.
మధ్యాహ్నం 1.10 గంటలకు స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో భోజనం.
మధ్యాహ్నం 2.10 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు వెళ్తారు.