చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్27 : చేనేత రంగానికి ప్రసిద్ధిగాంచిన కొయ్యలగూడెం గ్రామం మరోసారి జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. ప్రకృతి రంగులతో అద్భుత ప్రతిభ కనబర్చిన ఆ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దుద్యాల శంకర్ మెరిట్ సర్టిఫికెట్కు ఎంపికయ్యారు. ఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం సర్టిఫికెట్ అందుకోనున్నారు. చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన చేనేత కళాకారులకు ఈ సర్టిఫికెట్ ఇస్తుంది. దీనికోసం 20 19 సంవత్సరంలో దేశవ్యాప్తంగా నేత కళాకారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందులో భాగంగా ప్రకృతి రంగులు అద్దిన టై అండ్ డై పద్ధతిలో డైమండ్ డిజైన్లో మగ్గంపై తాను నేసిన సింగిల్ ఇక్కత్ పట్టుచీరను ఈ పురస్కారం కోసం శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో పరిశీలించిన అనంతరం జాతీయ స్థాయి పోటీకి పంపించారు. అత్యంత నైపుణ్యం ఉన్న దీనికి జాతీయ మెరిట్ సర్టిఫికెట్ దక్కింది. దేశ వ్యాప్తంగా 10 మందిని ఎంపిక చేయగా నుంచి శంకర్ ఒక్కరికే అవకాశం వచ్చింది. ఇతని సేవలకు గతేడాది కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత పురస్కారం కూడా లభించింది.
చదవింది నాలుగు
చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న శంకర్ నాలుగు వరకు చదువుకున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నతనం నుంచే వృత్తిపై ఆధారపడ్డాడు. అయినా చేనేత వస్త్ర తయారీలో నూతన డిజైన్లు స్పష్టించడంలో అందెవేసిన చేయి. ఇతను స్పష్టించిన డిజైన్లను పలువురు ప్రశంసించారు. అనేక ప్రాంతాల్లో జరిగిన చేనేత ఎగ్జిబిషన్లలో సైతం పాల్గొని వస్ర్తాలను ప్రదర్శించారు.