మోత్కూరు, ఏప్రిల్ 13 : తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడా లేనివిధంగా వినూత్నంగా ఉగాది (ప్లవనామ తెలుగు నూతన సంవత్సరం) పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజలంతా కులమతాలకతీతంగా బోనాలు, ఫలహారం (ఎడ్లబండ్ల)బండ్లతో స్వాగతం పలికారు. ఉదయం నుంచి మహిళలు అమ్మ వారికి బోనాలు సమర్పించారు. ఆలయం చుట్టూ ఫలహారం బండ్లను తిప్పుతూ ప్రదర్శనలు చేశారు. భక్తిభావంతో చెరువు కట్ట సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి , సుందర్యకాలనీలోని పడమటి ముత్యాలమ్మ, కొండాపురంలోని ముత్యాలమ్మలకు బోనాలు సమర్పించారు. ఆలయాల చుట్టూ ఫలహారం బండ్లు, ట్రాక్టర్లు, లారీలు, కార్లు, మోటార్సైకిళ్ల ప్రదర్శనలు చేపట్టారు. యువకులు బైకుల విన్యాసాలు చేసి అలరించారు. డప్పు వాయిద్యాల నడుమ గామ పెద్దలు బొడ్రాయి, ముత్యాలమ్మకు నూతన పట్టు వస్ర్తాలు సమర్పించారు. పురోహితుడు పారునంది వెంకటరమణశర్మ ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశ్రాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్ వెంకన్న, శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామచంద్రుగౌడ్, గ్రామ పెద్దలు మల్లయ్య, శ్రీను, ఆనందం, సీతయ్య, మత్స్యగిరి,రాజు పాల్గొన్నారు.