2021-22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన కలెక్టర్ పమేలా సత్పతి
కరోనా వైరస్ ఎన్నో రంగాలను ఆర్థికంగా కుదిపేసింది. అన్నివర్గాల ప్రజానీకం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వస్తోంది. జిల్లాలో వార్షిక రుణ ప్రణాళికను అమలు చేయించి బ్యాంకుల ద్వారా లక్ష్యానికి మించి రుణాలను అందించడం ద్వారా ఆర్థిక భరోసాను నింపుతోంది. ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని రూ.2,9 37.09 కోట్లుగా బ్యాంకులు నిర్దేశించుకున్నాయి. ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ.2,7 79 కోట్లు.. ప్రాధాన్యేతర రంగాలకు రూ.157కోట్లుగా కేటాయింపులు జరిపాయి. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి పంట రుణాలను రూ.2,34 9.73కోట్లు ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. గత యేడాది కంటే ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం 525.38కోట్లు అధికం కాగా.. గత యేడాది లక్ష్యానికి మించి బ్యాంకులు 115 శాతం మేర రుణాలను అందించాయి. అయితే ఈసారి గతేడాది మాదిరిగానే రుణ లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ పమేలా సత్పతి గురువారం బ్యాంకర్ల వార్షికరుణ ప్రణాళికను ఆవిష్కరించిన సందర్భంగా ఆకాంక్షించారు.
యాదాద్రి భువనగిరి, జూన్ 24 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు రుణాలు అందించేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతియేటా ప్రణాళిక తయారవుతున్నది. వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా ఆయా రంగాలకు రుణాలు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు ప్రతి యేటా ప్రణాళిక లక్ష్యానికి మించి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ వస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 105 శాతం మేరకు రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,411.7 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రూపొందించుకోగా.. లక్ష్యానికి మించి 2,761 కోట్ల (115 శాతం) రుణాలను బ్యాంకులు అందించాయి. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి సాగుకోసం వార్షిక ప్రణాళికలో రూ.2,349.73కోట్ల రుణాలను రైతులకు ఇచ్చేందుకు బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. విస్తారంగా వర్షాలు పడటం.. మూసీజలాలకు తోడు గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో వానకాలంలో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేసేందుకు ఉపక్రమించారు. ఈ పరిస్థితుల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి.
ఉపాధి రంగాలకు విరివిగా రుణాలు
ఉపాధి రంగాలకు ఊతమిచ్చేలా బ్యాంకులు ఈ ఏడాది కూడా విరివిగా రుణాలు అందించనున్నాయి. 2021-22 వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు మొత్తం రూ.2,779 కోట్లు (80శాతం), ప్రాధాన్యేతర రంగాలకు రూ.157 కోట్ల కేటాయింపులు జరిపారు. చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల రంగాలకు రూ.293 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రుణాల కింద రూ.387.50 కోట్లు అందించనున్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్లో ఉన్న 2,058 మంది వీధి వ్యాపారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశానుసారం 15 రోజుల్లోగా రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా పశు సంవర్ధక, మత్స్యశాఖ రంగాలకు కూడా రుణాలు ఇచ్చి ఆయా రంగాలకు బ్యాంకులు అండగా నిలువనున్నాయి.
రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించాలి
గత యేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్యాంకులు రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్ పమేలాసత్పతి బ్యాంకర్లను కోరారు. 2021-22 వార్షిక రుణ ప్రణాళికను గురువారం కలెక్టరేట్లో ఆమె ఆవిష్కరించారు. అంతకు ముందు జిల్లా బ్యాంకర్ల సమన్వయ కమిటీ, సంప్రదింపుల కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి గూగూల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..బ్యాంకులు వివిధ రంగాలకు లింకేజీ రుణాలు అందించి ఆయా రంగాల వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు తోడ్పాటునందించాలన్నారు. సమన్వయంతో కృషిచేసి గత యేడాది రుణ లక్ష్యాలను అధిగమించడంపై బ్యాంకర్లు, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి నాగార్జునబాబును కలెక్టర్ అభినందించారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న నేపథ్యంలో గ్రామానికి సంబంధించిన సర్వీస్ బ్యాంకులన్నీ మహిళా గ్రూపులకు బ్యాంక్ లింకేజీ రుణాలు, ఇతరత్రా రుణాలను అందించాలని సంబంధిత కంట్రోలింగ్ అధికారులకు సూచించారు. గ్రామంలో ఉన్న 41 గ్రూపుల్లో 31 గ్రూపులకు మాత్రమే బ్యాంక్ లింకేజీ సౌకర్యం ఉన్నందున..మిగిలిన 10 సంఘాలను అర్హతను బట్టి లింకప్ చేసి రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో వీధి వ్యాపారులకు చిన్నమొత్తాల రుణాలు ఎంతో ఆసరాగా నిలువనున్నందున వారికి ప్రాధాన్యత క్రమంలో రుణాలు అందించాలన్నారు. లబ్ధిదారులను పదేపదే బ్యాంకుల చుట్టూ తిప్పించుకోకుండా అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ ఒకేసారి తెప్పించుకునేలా చెక్లిస్టు రూపొందించి ముందుగానే అందించాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరైన లబ్ధిదారుల యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేపట్టాలని కోరారు. సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధి సాయికుమార్, ఎల్డీఎం నాగార్జునబాబు, నాబార్డు డీడీఎం వినయ్, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు, వివిధ అభివృద్ధి సంస్థల అధికారులు పాల్గొన్నారు.