నల్లగొండ, అక్టోబర్ 25 : కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులను ఆందోళనలోకి నెడుతున్నది. మరోవైపు దొడ్డురకం బియ్యం కొనలేమని చేతులెత్తేసింది. దీంతో రాష్ట్రంలో వరిసాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని రాష్ట్ర సర్కారు సూచిస్తున్నది. ఇప్పటికే వానకాలం పంట పూర్తవుతుండగా వచ్చే యాసంగి నుంచి వరికి బదులు పప్పుధాన్యాలు, నూనెగింజలు సాగు చేయాలని చెబుతున్నది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ
అధికారులు నేటి నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏ పంటలు సాగు చేస్తున్నారు.. యాసంగి నుంచి ఏ పంటలు వేస్తారు అనే దానిపై గ్రామాలు, మండలాల వారీగా స్పష్టంగా వివరాలు సేకరించనున్నారు. ఈ నెల 30న ఈ నివేదికను సర్కారు అందజేయనున్నారు. మంగళవారం నల్లగొండ జిల్లాలో, బుధవారం సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో అవగాహన సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఎఫ్సీఐ దొడ్డు రకం బియ్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేక పోవడంతో వాటికి బదులుగా ఇతర పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యాసంగి సీజన్లో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. ప్రధానంగా నూనె గింజలతో పాటు పెసర, మినుము, కందులు, బొబ్బర్లు లాంటి పప్పుదినుసులు సాగు చేసుకోవాలని సూచిస్తున్నది. నూనె గింజల్లో ఆముదం, పొద్దు తిరుగుడుతో పాటు భారీగా సబ్సిడీ అందజేస్తున్న ఆయిల్పామ్పై రైతాంగం దృష్టి సారించాలని కోరుతోంది. జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల యంత్రాంగం ఈ విషయమై రైతాంగానికి అవగాహన కల్పించించేందుకు సిద్ధమైంది.
దొడ్డు రకం తగ్గించే దిశగా ప్రణాళిక
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గత యాసంగిలో 4.68 లక్షల ఎకరాల్లో వరి, 20వేల ఎకరాల్లో పప్పుదినుసులు, నూనె పంటలు సాగు చేశారు. ఈ సారి ఎఫ్సీఐ దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను మళ్లించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సాగర్ ఆయకట్టులో సన్న ధాన్యం, అందునా పచ్చి ధాన్యమే మిల్లర్లు కొనుగోలు చేస్తున్నందున డిమాండ్ మేరకు రైతులు వాటిని సాగు చేసే అవకాశం ఉంది. నాన్ ఆయకట్టులోనూ సన్న ధాన్యానికి డిమాండ్ మేరకు 2.50 లక్షల ఎకరాల్లో సాగైనప్పటికీ మరో 2.70 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పించనున్నారు. సూర్యాపేట , యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ ఇదే పద్ధతిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించనున్నారు. అవగాహన సమావేశాల అనంతరం రైతుల అభిప్రాయం మేరకు జిల్లాలోని డీలర్లు, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రైతులకు అవసరమైన విత్తనాలనే సరఫరా చేసే విధంగా సూచనలు చేయనున్నారు.
ఈ నెల 29 వరకు సదస్సులు
నేటి నుంచి ఈ నెల 29 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 253 రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికలు రూపొందించనున్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలోని గ్రామం, అక్కడి ఉన్న సాగు భూములు, సాగు చేసే పంటలపై అనే విషయమై అధికారులు రైతులతో సమావేశమై చర్చించనున్నారు. దొడ్డు రకం వరి సాగు చేస్తే వచ్చే మార్కెటింగ్ కష్టాలను వివరించి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ఒప్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ విషయమై ఈ నెల 30వ తేదీన ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఉద్యానవన శాఖ, రైతుబంధు సమితి సభ్యుల సమన్వయంతో నేటి నుంచి నల్లగొండ జిల్లాలో జరిగే రైతు అవగాహన సదస్సుల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొననున్నారు.
నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు
దొడ్డు రకం బియ్యం ఎఫ్సీఐ కొనే పరిస్థితి లేనందున ఈ యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు అవగాహన కల్పించేందుకు నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రైతు వేదికల్లో రైతు ప్రతినిధులతో కలిసి ఉద్యాన, వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రైతుల కోరికను బట్టి యాసంగి సీజన్కు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచుతాం.