యాదాద్రి, అక్టోబర్ 25 : యాదాద్రి అనుబంధాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో సోమవారం పరమశివుడికి అత్యంత వైభవంగా రుద్రాభిషేకం నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్లో వెలసిన బాల శివాలయంలో ప్రభాతవేళలో మొదటగా గంటన్నరపాటు శివుడ్ని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో అలంకరణ చేశారు. శివాలయం ప్రధాన పురోహితుడి ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. యాదాద్రీశుడి నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండి జోడుసేవను అత్యంత వైభవంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని సామూహిక వ్రతమాచరించారు. పూర్వగిరి(పాతగుట్ట) నరసింహస్వామివారి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామివారిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ అశోక్కుమార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వామివారి వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. శ్రీవారి ఖజానాకు రూ.10,15,323 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.