యాదాద్రి భువనగిరి, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి యేటా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను జలాశయాల్లో వదులుతోంది. 2018-19 సంవత్సరంలో 99 లక్షల చేపపిల్లలు, 2019-20 సంవత్సరంలో 2.15 కోట్ల చేపపిల్లలు, 2020-21 సంవత్సరంలో 2.20కోట్ల చేపపిల్లలను జిల్లా మత్స్యశాఖ చెరువుల్లో వదలగా ఈ ఏడాది 3.15కోట్ల చేప పిల్లలను వదులుతోంది. 80-100 ఎంఎం సైజుగల ఒక్కో చేప పిల్ల కోసం రూ.1.55పై. లను, 35-40 ఎంఎం సైజుగల చేప పిల్ల కోసం 60పై.చొప్పున ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది వదిలే చేప పిల్లల కోసం రూ.కోటికి పైగా వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. నీలి విప్లవం పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను సైతం పూర్తి సబ్సిడీపై మత్స్యకార్మికులకు అందిస్తుండడంతో ఆయా వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
435 చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు కలిపి 1,210 వరకు ఉన్నాయి. వీటిలో మత్స్యశాఖ ఆధీనంలో 181 చెరువులు, గ్రామపంచాయతీల ఆధీనంలో 1,029 వరకు చెరువులు ఉన్నాయి. మూసీతో పాటు గతేడాది నుంచి జిల్లాకు గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయి. వర్షాలు సైతం సమృద్ధిగా కురుస్తుండటంతో ఇప్పటికే చాలా వరకు చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. చేపపిల్లలు పెరిగేందుకు నీటి లభ్యత ఉన్న 435 చెరువుల్లో గతేడాది మాదిరిగానే చేప పిల్లలను వదిలేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 123 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు, మరో ఏడు వరకు మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 8,500 మంది సభ్యులు ఉన్నారు. గత యేడాది చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదలడంతో ఒక్కో సభ్యుడికి రూ.69వేల చొప్పున లబ్ధిచేకూరింది. ఈ లెక్కన గత యేడాదిలో రూ.56 కోట్లకు పైగా ఆదాయాన్ని మత్స్యకార్మికులు అందిపుచ్చుకున్నారు. వీరితోపాటు గ్రామ పంచాయతీ చెరువుల పరిధిలో ఉన్న నాన్ సొసైటీ సభ్యులకు సైతం ప్రతి యేటా నీలి విప్లవం ఫలితాలు అందుతున్నాయి.
రొయ్యల పంపిణీకి కసరత్తు
చెరువుల్లో గత యేడాది మాదిరిగానే ఈసారి కూడా రొయ్యల పెంపకాన్ని చేపట్టేందుకు జిల్లా మత్స్యశాఖ దృష్టి సారించింది. గత యేడాది బీబీనగర్, జైనపల్లి చెరువుతోపాటు రామన్నపేట మండలంలోని మునివంపుల చెరువుల్లో రొయ్యలను వదిలారు. గత యేడాది చేపట్టిన రొయ్యల పెంపకం సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి కూడా రొయ్యలను వదలాలని సంబంధిత శాఖ సంకల్పిస్తోంది. రెండు లక్షల రొయ్యలను వదిలేందుకుగాను త్వరలోనే అవసరమైన చర్యలను అధికారులు చేపట్టనున్నారు. నీలి విప్లవంతో చేపలు సమృద్ధిగా పల్లె, పట్టణ వాసులకు దొరుకుతున్నాయి. గతంలో చేపలకోసం సుదూరం వెళ్లాల్సి రాగా..గత రెండు, మూడేండ్లుగా స్థానికంగానే తక్కువ ధరకే బొచ్చ, రొయ్య తదితర రకాల చేపలు దొరుకుతున్నాయి.
టెండర్ల దశలో ఉంది
ఈ ఏడాది చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచాం. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తయితే తదుపరి చర్యలు తీసుకుంటాం. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకార్మికులకు చేపల యూనిట్ నిర్మాణాలను, ఐస్ ప్లాంట్ల నిర్మాణం, వాహనాలను సబ్సిడీపై అందిస్తున్నాం. చేపలను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. మహిళా మత్స్యకార సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ సమకూర్చి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడేలా చర్యలు చేపడుతున్నాం. చేప పిల్లలను ఉచితంగా అందించి వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుని మత్స్యకార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
-ఎస్ఏ రహమాన్, జిల్లా మత్స్యశాఖ అధికారి,యాదాద్రి భువనగిరి జిల్లా