యాదాద్రి భువనగిరి, జూలై 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిండుకుండల్లా కన్పిస్తున్న చెరువులు రైతుల్లో ఆశలను రేకెత్తిస్తున్నాయి. వానకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు సమృద్ధిగానే కురుస్తున్నాయి. ఈ వర్షాలు పంటలకు మరింతగా మేలు చేకూర్చుతున్నాయి. అటు గోదావరి జలాలు, ఇటు మూసీ పరవళ్లకు వర్షం నీరు తోడై అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో 1,005 చెరువులు ఉండగా, 135 చెరువుల్లోకి సమృద్ధిగా నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. మరో 167 చెరువుల్లో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరింది. 212 చెరువుల్లో 25శాతం లోపుగా నీరు చేరితే, 268 చెరువుల్లోకి 50శాతం, 223 చెరువుల్లోకి 75శాతం మేర వర్షం నీరు వచ్చి చేరింది. వాగుల్లో నిర్మించిన చెక్ డ్యాంలలోనూ పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో భూగర్భ జలాలు మరింత వృద్ధి చెందనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో 3,19,474 ఎకరాల్లో పంటలను సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటికే సింహభాగం మేర వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. ప్రస్తుత వర్షాలు ఆయా పంటలకు మేలు చేకూర్చనున్నాయని రైతులు అంటున్నారు.
15 మండలాల్లోనూ అత్యధికం..
వర్షాకాలం ప్రారంభమైన జూన్ మాసం నుంచీ వరుణుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు. జూన్ 1 నుంచి జూలై 22వ తేదీ వరకు 213.9 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 419.6 ఎంఎం వర్షపాతం నమోదైంది. రెండు నెలల కాలంలోనే 96 శాతం అధికంగా వర్షం కురిసింది. గురువారం అడ్డగూడూరు, మోటకొండూరు మండలాలు మినహా మిగతా 15 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుర్కపల్లి మండలంలో 30.8 ఎంఎం, రాజాపేట మండలంలో 48.0 ఎంఎం, ఆలేరు మండలంలో 42.8 ఎంఎం, యాదగిరిగుట్ట మండలంలో 38.4 ఎం ఎం, భువనగిరిలో 38.6ఎంఎం, బొమ్మలరామారంలో 30.2ఎంఎం, బీబీనగర్లో 32.2 ఎంఎం, భూదాన్పోచంపల్లిలో 34.8 ఎంఎం, చౌటుప్పల్లో 23.4ఎంఎం, నారాయణపురంలో 18.4ఎంఎం, రామన్నపేటలో 36.2ఎంఎం, వలిగొండలో 28.6ఎంఎం, ఆత్మకూరు(ఎం)లో 45.8ఎంఎం, మోత్కూరులో 34.2ఎంఎం, గుండాలలో 45.8ఎంఎం వర్షపాతం నమోదైంది.