పాలకవీడు, జూలై 27 : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యతను చాటేలా నిర్వహించే ఈ పండుగ వారి సంప్రదాయానికి అద్దం పడుతున్నది. పంటలు బాగా పండాలని, పశు సంపద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి ఆరాధన ఆ పండుగ అంతర్లీనంగా ఉంటుంది.
అత్యధికంగా తండాలు కలిగిన పాలకవీడు మండలంలోపాటు బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లోనూ సీత్లా పండుగ సందడి నెలకొన్నది. లాలితండా, బెట్టెతండా, పాడ్యాతండా, చెర్వుతండా, కల్మటితండా, కొత్తతండా, శూన్యంపహాడ్, దేవ్లాతండా, మీగడంపహాడ్ తండా, లక్ష్మీతండాల్లో పండుగలు జోరందుకున్నాయి. గిరిజనుల తొలి పండుగ సీత్లా. ఆషాఢ మాసం పెద్ద పుష్యాల తొలి పాదంలో ఈ పండుగను జరుపుకొంటారు. తండాలోని కుటుంబాలన్నీ సామూహంగా ఏర్పడి ప్రకృతి దేవతలైన సీత్లా భవానీతో పాటు ఆరుగురు భవానీల ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వర్షాలు బాగా కురువాలని పాడి పంటలతో పల్లెలు, తండాలు సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ మొక్కులు చెల్లించుకొంటారు. ఏడు రకాల వం టకాలతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఆటా పాటలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తారు. ఈ తంతులో కుల పెద్దలు ప్రముఖపాత్ర పోషిస్తారు. సాయంత్రం వేళ అమ్మవార్లకు గొర్రె పోతులను బలి ఇచ్చి, పేగు పైనుంచి పశువులను దాటిస్తారు. దీనినే దాటుడు పండుగ అని అంటారు.