యాదాద్రి, సెప్టెంబర్ 27 : గులాబ్ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి పలు చోట్ల భారీగా, కొన్ని మండలాల్లో మోస్తరు వర్షం పడింది. చెరువులు ఇప్పటికే నిండి అలుగులు పోస్తున్నాయి. ఈ వర్షానికి వాగులు ప్రవహిస్తున్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో ముసురుతో రవాణాకు అంతరాయం కలిగింది. యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కొంత ఇబ్బందులు పడ్డారు. అత్యవసర పనులు మినహా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని గ్రామాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. యాదగిరిగుట్ట, మోటకొండూరు, ఆలేరు, గుండాల, బొమ్మలరామారం, ఆత్మకూరు(ఎం), తుర్కపల్లి, రాజాపేట మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఉదయం నుంచి మోస్తరు వర్షం కురిసింది. తుర్కపల్లి మండలం ఇబ్రహీంపురంలో బొరుగు యాదగిరి ఇంటి సమీపంలో పిడుగు పడడంతో ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి గృహోపకరణాలు కాలిపోయాయి.
భువనగిరి అర్బన్ : భువనగిరి మండల వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. పలు చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. పట్టణంలో భారీ వర్షం కురువడంతో బస్టాండ్, జూనియర్ కళాశాల ఆవరణ, ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రూరల్ పోలీస్స్టేషన్ సమీపంలోని కుంట అలుగు పోయడంతో రహదారిపైకి నీళ్లు వచ్చి వాహనాలు నిలిచిపోయాయి.
చౌటుప్పల్ : పట్టణంలో కురిసిన భారీ వర్షానికి కాలనీలన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ ప్రాంతంలో, ఉత్తరం దిక్కునున్న సర్వీస్ రోడ్డులో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వర్షానికి చిరు వ్యాపారాలు బంద్ అయ్యాయి.
మోత్కూరు : ఎడతెరిపి లేని వర్షంతో మోత్కూరు, గుండాల, ఆత్మకూర్(ఎం) మండలాల పరిధిలోని బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మండల కేంద్రంలోని బృందావన్ ఆనకట్ట అలుగు మత్తడి దుంకింది. మినీ ట్యాంక్బండ్ చెరువులోకి బృందావన్ కాల్వ నీరు వస్తున్నది. పాలడుగు చెరువు నిండి అలుగు పోస్తుంది. పొడిచేడు గ్రామ శివారులో మూసీ పరవళ్లు తొక్కుతోంది. దత్తప్పగూడెం, పొడిచేడు గ్రామాల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
సంస్థాన్ నారాయణపురం : మండలంలో కురిసిన వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నవాబు చెరువు, మేళ్ల చెరువు, గంగగుట్ట, చిల్లాపురం పెద్ద చెరువు, సర్వేల్ గ్రామంలోని చెరువులు అలుగు పోస్తున్నాయి. మండల కేంద్రంలోని ఊట చెరువు కట్టకు గండి పడడంతో ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్చందర్రెడ్డి జేసీబీతో మరమ్మతు చేయించారు.