మోత్కూరు/ఆలేరు టౌన్, జూలై 20 : త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుంది.. దైవ పరీక్షల్లో కట్టుకున్న భార్యను వదిలి కన్న కొడుకు ప్రాణాలను బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుడి త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. సుమారు ఐదు వేల ఏండ్ల క్రితం అల్లాహ్ కటాక్షం కోసం కట్టుకున్న భార్యను కన్న బిడ్డను త్యాగం చేయాలనుకున్న ఆయన భక్తి భావం చిరస్థాయిలో నిలిచిపోయింది. ఈ క్రమంలో దైవ పరీక్షలకు ఎదురు నిలిచి ముస్లింల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు ఇబ్రహీం. ఆచారాలు, మూఢ విశ్వాసాలను దూరం చేస్తూ ఆదర్శ సమాజాన్ని నెలకొల్పాలనుకున్న ఇబ్రహీం వైఖరి ఆ కాలంలో సంప్రదాయ వాదుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో అభ్యుదయ సమాజం నిర్మాణం కోసం ఇబ్రహీం దేశ సంచారీగా జీవితం గడిపాడు. సంచార జీవితం సాగిస్తున్న క్రమంలో తను నమ్మిన అల్లాహ్ నుంచి కూడా పరీక్షలు తప్పలేదు. అప్పటి నుంచి ఆయన అనితర సాధ్యమైన త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్(ఈదుల్ అజ్ హా) పర్వదినం జరుపుకుంటారు. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కారణంగా ఈసారి ముస్లిం సోదరులు పండుగను కొవిడ్ నిబంధనల మధ్య జరుపుకోక తప్పదు. ఈద్గాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇంటి వద్దనే నమాజ్ చేసుకుంటారు.
బక్రీద్ ఆచరణ…
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జిల్ హాజ్ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఖుర్యానీ చేసిన అనంతరం ముస్లింలు హజ్రత్ ఇబ్రహీం మాదిరిగానే దైవ ప్రీతి కోసం తమ ధనాన్ని, ప్రాణాన్ని సమస్తమూ త్యాగం చేయడానికి సిద్ధమేనని నిరూపించుకుంటారు. ఖుర్యానీ ఇస్లాం ఆజ్ఞలలో ఒక ముఖ్యమైనదని దైవ ప్రవక్త మహ్మద్ ఆదేశించాడు. బక్రీద్ రోజున ముస్లింలు సమాజ్ చేసిన అనంతరం ఖుర్యానీ(మాంసం) ఇస్తారు.
ఖుర్యానీతో లాభాలు…
బక్రీద్ పండుగ రోజున ఖుర్యానీ ఇచ్చే ముస్లీం సోదరులకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందట.. ఖుర్యానీ ఇచ్చేవారికి జంతువులపై ఉండే వెంట్రుకలకు పది రెట్లు పుణ్యఫలాలు దక్కుతాయన్నది సారంశం. ఖుర్యానీ ఇచ్చే అతను తను బలి చేసే జంతువు రక్తం భూమి మీద పడకముందే తాను చేసిన పాపాలకు మోక్షం లభిస్తుందని వారి నమ్మకం. పండగ రోజు సమాజ్ అనంతరం ఆర్థిక స్ధోమత ఉన్న వారంతా విధిగా ఖుర్యానీ ఇవ్వాలి. ఇందు కోసం పూర్తిగా ఇక సంవత్సరం నిండిన ఆరోగ్యకరమైన మేక లేదా గొర్రె ఏదైనా దైవ మార్గంలో సమర్పించాలి.
ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం
బక్రీద్కు ముందు రోజు ఉపవాసం ఉంటే పుణ్యం లభిస్తుంది. జలహాజ్ నెలలో ఉపవాసం ఉంటే ఒక ఏడాదంతా ఉపవాసం చేసినంత పుణ్యం చేకూరుతుంది. ప్రతిఒక్కరూ పేదలకు ఖుర్యానీ పంపిణీ చేయాలి. అయితే కరోనా కారణంగా ఈద్గాకు వెళ్లే అవకాశం లేదు. దీంతో ఇంటి వద్దనే నమాజ్ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఏటా బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం. కానీ ఈసారి మాత్రం కరోనాతో ఇబ్బందులు పడకతప్పదు. – మహ్మద్ అబ్దుల్ నబీ,మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు, మోత్కూరు
‘ఈదుల్ అజ్ హో’ త్యాగోత్సవం
దేవుడికి డబ్బు, ధనం, హోదా, భార్యాబిడ్డలు అవసరం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసే ఘడియలు ఈదుల్ అజ్ హో.. దైవ ప్రసన్నతే ధ్యేయంగా ప్రతిఒక్కరూ జీవితాన్ని సాగించాలి. ఈ పండుగ రోజున మనోవాంఛలను త్యాగం చేయాలి. – ఎండీ జైనుద్దీన్, ఆలేరు