రామగిరి, అక్టోబర్ 25 : దేశ వ్యాప్తంగా పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను శాస్ర్త, సాంకేతిక రంగంలో రాణించేలా సైన్స్ ప్రాజెక్టుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుం ది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిలియన్ మైండ్స్ అగ్యుమెంటింగ్ నేషనల్ యాస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్ (ఇన్స్పైర్ అవార్డు-మానక్)కు అవకాశం కల్పించింది. విద్యార్థులను ప్రయోగశాల వైపు ప్రోత్సహించమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా ఇన్స్పైర్-మానక్ అవార్డు కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రభు త్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల నుంచి ప్రాజెక్టులను ఆహ్వానిస్తుంది. ఇందులో నుంచి ఎంపిక చేసిన లక్ష ప్రాజెక్టులకు కేంద్ర ప్రభు త్వం నిధులు మంజూరు చేస్తుంది. ఒక్కోదానికి ఖర్చుల కోసం రూ.10వేలు విద్యార్థి ఖాతాలో జమ చేస్తుంది. జిల్లా స్థా యిలో మంజూరైన ప్రాజెక్టుల్లో 10 శాతం రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వాటిలో 10 శాతం ప్రాజెక్టులను జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలిచే 60 నమూనాలను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శిస్తారు. ఒక్కో ఉత్తమ ప్రదర్శనకు రూ.20వేల నగదు అందిస్తారు.
సృజనాత్మకతను వెలికి తీసేందుకే..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని శాస్త్ర, సాంకేతిక విభాగం (డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ఇన్స్పైర్ అవార్డు-మానక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రాజెక్టుల నామినేషన్స్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆమోదంతో వారి గైడ్ టీచర్ సహకారంతో www.inspireawards-dst.gov.in ఆన్లైన్లో నమోదుకు అవకాశం కల్పించారు. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులకు అవకాశం ఉంటుంది. 2021-22 సంవత్సరానికి భారత ప్రభుత్వ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా 10 లక్షల ప్రాజెక్టుల ఆలోచనలు రావాలని సంకల్పించారు. వాటిలో లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి విద్యార్థులకు రూ.10వేలు చొప్పున ఇచ్చి ప్రాజెక్టులు తయారు చేయించాలని నిర్ణయించారు.
స్పందన ఇలా…
ఇన్స్పైర్ అవార్డు-మానక్లో నమోదు చేసుకోవడానికి ఈ విద్యా సంవత్సరం దరఖాస్తుల (ఆన్లైన్ నామినేషన్స్) ప్రక్రియ నమోదు ప్రారంభమైన నాటి నుంచి జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను చైతన్యం చేశారు. కానీ వారు ముందుకు రాలేదు. 2021 జూలై 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా సెప్టెంబర్ 29నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 158 నామినేషన్స్ మాత్రమే నమోదయ్యాయి. దీంతో సెప్టెంబర్ 30న ‘ఏదీ ఇన్స్పైర్’ పేరుతో నమస్తే తెలంగాణ’ మినీలో ప్రచురితమైంది. దీన్ని చాలెంజ్గా తీసుకున్న నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా సైన్స్ అధికారి ఆన్లైన్లో హెచ్ఎంలు, సైన్స్ ఉపాధ్యాయులకు సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన పెంచారు. జిల్లా విద్యాశాఖ సూచనలతో ఆయా మండలాల ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు వారి పరిధిలోని యూపీఎస్, ఉన్నత పాఠశాలల్లో అవగాహన పెంచడంతో దరఖాస్తులు పెరిగాయి. అయితే.. ప్రభుత్వ పాఠశాలల నుంచి స్పందన బాగానే ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలల నుంచి అతి తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. సగానికి పైగా ప్రైవేట్ పాఠశాలలు ముందుకు రాని పరిస్థితి.
ఇన్స్పైర్-మానక్ అవార్డులో నల్లగొండ జిల్లా ప్రథమం
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 843 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఇన్స్పైర్ మానక్ -అవార్డుకు అర్హత కలిగి ఉన్నాయి. ఇందులో 495 ప్రభుత్వ, 345 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. జిల్లా నుంచి ఈ పర్యాయం 432 పాఠశాలల నుంచి 1,486 రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే.. ఇందులో అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలే రిజిస్ట్రేషన్స్ (ప్రాజెక్టులు) నమోదు చేశాయి. ప్రైవేట్ పాఠశాలలు ముందుకు వచ్చి ఉంటే వాటి సంఖ్య భారీగా పెరిగేది. సూర్యాపేట జిల్లాలో 551 (ప్రభుత్వ 318, ప్రైవేట్ 233) పాఠశాలలు అర్హత కలిగి ఉన్నాయి. వీటిలో నుంచి 146 పాఠశాలలు 538 ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడంతో రాష్ట్ర స్థాయిలో 26వ స్థానం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 403 (ప్రభుత్వ 256, ప్రైవేట్ 147) పాఠశాలలు అర్హత కలిగి ఉండగా.. 163 పాఠశాలల నుంచి 531 ప్రాజెక్టులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 27వ స్థానం దక్కింది.
గతేడాది కంటే తగ్గిన దరఖాస్తులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల సంఖ్య ఈ పర్యాయం చాలా తగ్గింది. 2020-21లో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన లేనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,596 ప్రాజెక్టులు నమోదు చేశారు. ఈ పర్యాయం వాటి సంఖ్య 2,555కు తగ్గింది.