భువనగిరి అర్బన్, జూలై 14: అధికారులందరూ ప్రభుత్వ పరమైన వివిధ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సభలు, సమావేశాల విషయంలో ప్రభుత్వం రూపొందించిన ప్రొటోకాల్ విధిగా పాటించాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్తివారీతో కలిసి ప్రొటోకాల్తో పాటు ప్రస్తుత వర్షాకాలంలో వరదల ఉధృతి, చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా అప్రమత్తతపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధిత శాఖల అధికారులు ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి తప్పిదాలకు పాల్పడవద్దన్నారు. ప్రొటోకాల్ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు, మ్యానువల్పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగినచో సంబంధితశాఖ అధికారిపై తగు చర్యలు తప్పవన్నారు. కరపత్రాలు, ఆహ్వాన పత్రికలు, శిలాఫలకాలు రూపొందించడంలో ఇష్టంవచ్చిన రీతిలో అతిథుల పేర్లు ముద్రించరాదని ఆదేశించారు. జిల్లాలో ప్రొటోకాల్ విషయంలో జరిగిన తప్పిదాలను కలెక్టర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఇక ముందు ఎలాంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్లు, రోడ్లు, భవనాల శాఖల ఇంజినీర్లతో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తతతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాలకు చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా వాటర్లెవల్స్ను తరచూ అంచనా వేస్తూ పరిశీలించాలన్నారు. గండ్లు పడే ప్రమాదం ఉన్న వాటిని ముందే గుర్తించి అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కలెక్టరేట్తో పాటు ఇరిగేషన్ కార్యాలయంలో 24/7 పనిచేసేలా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక వాట్సాప్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా మున్సిపల్ కమిషనర్లు కూడా మురుగు కాల్వలు నిండి ప్రవహించకుండా డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు భూపాల్రెడ్డి, సూరజ్కుమార్, ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య, ఇరిగేషన్ ఇంజినీర్లు, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, సెక్షన్ పర్యవేక్షికుడు రవికుమార్ పాల్గొన్నారు.
హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలి
హరితహారంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలని కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులను ఆమె ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమం పూరైన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నామినేట్ చేయబడిన అటవీ అధికారులు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పర్యటించి నాటిన మొక్కలు, చేపట్టిన రక్షణ చర్యలు పరిశీలిస్తారని తెలిపారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆమె అధికారులను ఆదేశించారు.