యాదాద్రి, జూలై 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం సర్వేషామేకాదశి (తొలి ఏకాదశి) పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. వేకువజామునే లక్ష్మీనరసింహులను సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు, బాలాలయంలో కవచమూర్తులను హారతిలో కొలిచారు. మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో పూజలు నిర్వహించారు. పాంచరాత్రగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రిక్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చనలు చేయడం ఆలయ సంప్రదాయం. బాలాలయ కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు గజవాహనంతో సేవోత్సవం నిర్వహించారు. నిత్య తిరుకల్యాణ, సుదర్శన నారసింహహోమం నిర్వహించారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలోనూ ఏకాదశిని పురస్కరించుకుని స్వయంభువులను కొలుస్తూ విశేష పూజలు నిర్వహించారు. లక్ష పుష్పార్చన పూజల్లో దేవస్థాన ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా ఆంజనేయుడికి ఆకుపూజ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని విష్ణు పుష్కురిణ వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి శ్రీ చందనంతో అభిషేకించారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం నిర్వహించారు. ఆంజనేయస్వామివారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రూ. 9,11,089 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 9,11,089 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్ ద్వారా రూ. 94,274, రూ. 100 దర్శనం ద్వారా రూ. 33,000, నిత్యకైంకర్యాల ద్వారా రూ. 2,000, సుప్రభాతం ద్వారా రూ. 700, క్యారీబ్యాగుల ద్వారా రూ. 1,100, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 38,50 0, కళ్యాణకట్ట ద్వారా రూ. 12,600, ప్రసాద విక్రయం ద్వారా రూ. 3,74,300, శాశ్వతపూజల ద్వారా రూ. 57,696, వాహనపూజల ద్వారా రూ. 9,700, టోల్గేట్ ద్వారా రూ. 900, అన్నదాన విరాళం ద్వారా 3,983, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 81,400, యాదరుషి నిలయం ద్వారా రూ. 49,130, పాతగుట్ట ద్వారా రూ. 19,150, కొబ్బెరికాయల విక్రయాల ద్వారా రూ. 43,500, ఇతర విభాగాల ద్వారా రూ. 87,556 కలుపుకుని రూ. రూ. 9,11,089 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.