ఆత్మకూరు(ఎం), జూలై 14 : ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి స్ఫూర్తితో మండలంలోని రహీంఖాన్పేట అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్నది. 1795 జనాభా కలిగిన గ్రామంలో 1300 మంది ఓటర్లు ఉన్నారు. 353 ఇండ్లు ఉన్నాయి.
రూ.31 లక్షల 60వేలతో అభివృద్ధి పనులు
గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.31 లక్షల 60వేలు మంజూరు చేయగా రూ.12లక్షల 60వేలతో వైకుంఠధామం, రూ.2లక్షల 50వేలతో కంపోస్ట్షెడ్ నిర్మాణం పనులను పూర్తి చేశారు. రూ.10 లక్షలతో కొత్త విద్యుత్ మోటర్ల ఏర్పాటు, రూ.5లక్షలతో వీధి లైట్లు, అర ఎకరం స్థలంలో రూ.లక్షా 50వేలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు.
పచ్చదనంతో పరిశుభ్రంగా గ్రామం
పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా గ్రామం మెరిసిపోతున్నది. గ్రామంలోని ప్రధాన వీధుల వెంట 3000 మొక్కలు నాటి సంరక్షించగా ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున 2200ల మొక్కలు పంపిణీ చేశారు. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాలకు చెందిన 1650 మొక్కలు పెంచుతున్నారు. గ్రామ పరిశుభ్రతలో భాగంగా పంచాయతీ కార్యాలయం సిబ్బంది ప్రతి రోజూ వీధులతో పాటు మురుగు కాల్వలను శుభ్రపర్చుతున్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా రోజూ ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్షెడ్కు తరలిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎటు చూసినా పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా కనబడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పల్లె ప్రగతితో గ్రామం అభివృద్ధి
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామ అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గ్రామాల అభివృద్ధి కోసం వినూత్నంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామం ఇప్పుడు పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా మారింది. ప్రభుత్వం అందించిన సహకారానికి తోడు రూ.8 లక్షలతో సొంతంగా గ్రామంలోని ప్రధాన రోడ్డు నుంచి శివాలయం వరకు విద్యుత్ స్తంభాలతో పాటు వీధి లైట్లను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతాం. -దుంప వెంకటేశ్, ఎంపీటీసీ, రహీంఖాన్పేట