యాదాద్రి,జూలై18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొన్నది. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. నారసింహుడి జన్మనక్షత్రం సందర్భంగా బాలాలయ మండపంలో 108 శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కలశాలల్లోని జలాలకు పూజలు జరిపారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులు, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసి దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను రథసేవలో తీర్చిదిద్ది బాలాలయ మండపంలో ఊరేగించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంంగా భక్తులు వేకువ జామునే కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అష్టోత్తర శతఘటాభిషేకం పూజల్లో ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూ ర్తి, అధికారులు పాల్గొన్నారు.
భక్తులతో సందడి
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు, మొక్కు పూజ ల నిర్వహణతో మండపాలు రద్దీగా కనిపించాయి. ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో సందడి నెలకొన్నది. ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు భక్తుల రద్దీ ఎక్కువకావడంతో కొండపైకి వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. స్వామివారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణమహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. అనుబంంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
వైభవంగా ద్వార పునఃప్రతిష్ఠాపనోత్సవం..
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి గర్భాలయ ద్వార పునఃప్రతిష్ఠాపనోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించారు. అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవరులను అధిష్ఠించారు. ఆలయ సంప్రోక్షణ గావించి స్వామివారి దర్శనాన్ని పునః ప్రారంభించారు. అనంతరం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని శ్రీవారికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, దాత శ్రీ మురార్జీ, అర్చకులు మాధవాచార్యులు, ఏఈవో దోర్బాల భాస్కర్ శర్మ పాల్గొన్నారు.
చరిత్రలో నిలిచేలా యాదాద్రి నిర్మాణాలు
చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయని సినీ నటుడు సాయికుమార్ అన్నారు. ఈ నెల 27వ తేదీన 60వ పుట్టినరోజు పురస్కరించుకుని ఆదివారం యాదాద్రీశుడిని ఆయన సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పారు. ఆకాశాన్ని తాకేలా నిర్మించిన యాదాద్రి ఆలయం తీరు భేష్గా ఉందన్నారు.
శ్రీవారి ఖజానాకు రూ.17,03,953 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 17,03,953 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్ ద్వారా రూ. 2,49,582, రూ. 100 దర్శనం ద్వారా రూ. 25,100, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 1,95,000, నిత్యకైంకర్యాల ద్వారా రూ. 4,001, సుప్రభాతం ద్వారా రూ. 2,700, క్యారీబ్యాగుల ద్వారా రూ. 3,600, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 29,000, కల్యాణకట్ట ద్వారా రూ. 23,600, ప్రసాద విక్రయం ద్వారా రూ. 6,77,855, శాశ్వతపూజల ద్వారా రూ. 31,464, వాహనపూజల ద్వారా రూ. 9,900, టోల్గేట్ ద్వారా రూ. 1,120, అన్నదాన విరాళం ద్వారా రూ. 76,424, సువ ర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,15,040, యాదరుషి నిల యం ద్వారా రూ. 78,740, పాతగుట్ట ద్వారా రూ. 27,355, కొబ్బరికాయల విక్రయాల ద్వారా రూ. 66,0 00, ఇతర విభాగాలతో రూ. 87,472 కలుపుకొని రూ. రూ. 17,03,953 ఆదాయం సమకూరింది.