యాదాద్రి భువనగిరి, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం గ్రీన్ ఇండియా చాలెంజ్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒకే రోజు మూడు కోట్ల మొక్కలను నాటి మంత్రి కేటీఆర్కు పుట్టినరోజు కానుక ఇవ్వాలన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునివ్వగా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పంచాయతీని యూనిట్గా తీసుకుని సర్పంచ్ నేతృత్వంలో గుర్తించిన అన్ని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటనున్నారు. మున్సిపాలిటీల్లోనూ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఏర్పాట్లు చేశారు. గ్రామీణాభివృద్ధ్దిశాఖ, మున్సిపల్, అటవీశాఖలు సమన్వయం చేసుకుని మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు మొక్కలను ఇప్పటికే సమకూర్చాయి.
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలతోపాటు, 17 మండలాల పరిధిలోని 421 పంచాయతీల్లో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపడుతుండగా.. ప్రతి పంచాయతీలోనూ 500-600 వరకు మొక్కలు, ప్రతి మున్సిపాలిటీలో 500 చొప్పున శనివారం ఒక్కరోజే నాటనున్నారు. నర్సరీల్లో ఉన్న మొక్కలను, అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలను నాటేందుకు సమకూర్చారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజులో 1.60లక్షల మొక్కలను నాటేందుకు రంగం సిద్ధం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఈ మహాకార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహిళా సంఘాలు, విద్యార్థులతోపాటు, సామాన్య ప్రజానీకం సైతం ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుంటున్నది.
ఎవరు…ఎక్కడంటే..
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి, యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్పేట, ఆలేరు మండలంలోని శారాజీపేట గ్రామాల్లో నిర్వహించే ముక్కోటి వృక్షార్చనలో పాల్గొంటారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి మండలంలోని హన్మపురం, బీబీనగర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో మొక్కలు నాటుతారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి బొమ్మలరామారం మండలం మేడిపల్లిలో జరిగే ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటనున్నారు.
వనమాలి బిరుదు ప్రదానం
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్ణయించింది. మొక్కలు నాటిన తర్వాత ఫొటోలు దిగి ప్రత్యేక యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను వాట్సాప్ నుంచి 9000365000 నెంబర్కు GIC అని మెసేజ్ చేస్తే యాప్ లింక్తో కూడిన మెసేజ్ తిరిగి మన మొబైల్కు వస్తుంది. అందులో ఫొటోను అప్లోడ్ చేస్తే.. మంత్రి కేటీఆర్ సందేశంతో కూడిన వనమాలి బిరుదు మెయిల్కు లేదా మొబైల్కు వారం రోజుల్లోపు వస్తుంది.
మొక్కలు నాటాలి
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులందరూ ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగే జన్మదినం వేడుకలకు ప్రజా ప్రతినిధులు హాజరుకావాలన్నారు.
ఆలేరులోని ఐటీఐ కళాశాల,శారాజీపేటలో
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలేరులోని ఐటీఐ కళాశాల, శారాజీపేటలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హాజరవుతున్నారని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మండల, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, మొరిగాడి వెంకటేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.
నేడు వాసాలమర్రికి ప్రభుత్వ విప్ రాక
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం మండలంలోని వాసాలమర్రిలో నిర్వహించే హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రానున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.