యాదాద్రి భువనగిరి, జూలై 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :డబ్బు ఏండ్లకు పైబడ్డ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య ఫలాలు అందని వర్గాలు ఎన్నో. జాబితా తీస్తే మొదట కనిపించేది గిరిజనులే. పేరుకు రిజర్వేషన్లు కల్పించినా.. ప్రజా ప్రతినిధులుగా వారికి అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. కానీ.. గిరిజనులకు నిజమైన ప్రజాస్వామ్యాన్ని చేరువ చేశారు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు. విప్లవాత్మక చట్టంతో తండాలు, గూడేలకు గ్రామ పంచాయతీల హోదా కల్పించి గిరిజనుల సంకల్పాన్ని నెరవేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,214 గ్రామపంచాయతీలు ఏర్పాటవ్వగా, ఈ గిరిజన పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో స్థానిక గిరిజనులే పట్టాభిషిక్తులయ్యారు. ‘మన తండా.. మన పాలన’ అన్న నినాదంతో వీరంతా గ్రామస్వరాజ్యం దిశగా అడుగులు వేశారు.
స్వరాష్ట్రంలో నెరవేరిన గిరిజనుల ఆకాంక్ష…
తండాల్లో స్వపరిపాలన కోసం గిరిజనులు చేసిన దశాబ్దాల పోరాటాలను ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ.. పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చారు. ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ గిరిజనుల కష్ట సుఖాలను కళ్లారా చూశారు. అప్పట్లో ఆయన తిరుగని ఊరు లేదు. ఈ క్రమంలోనే గిరిజన తండాల్లో పర్యటించిన సందర్భంలో ససీఎం కేసీఆర్ పూర్వ నల్లగొండ జిల్లాలోని నాగారం తండాలో పర్యటించారు. తండా గిరిజనులతో ముచ్చటించి వారి సాధక బాధలు తెలుసుకున్నారు. ఒక్కో తండాది ఒక్కో యాతన అని గ్రహించారు. తండాలు, గూడేలు స్వయం సమృద్ధి చెందాలంటే వారి పాలన వారి చేతుల్లోనే ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనులకు రాజ్యాధికారం కల్పించారు. తండాల అభివృద్ధికి బాటలు వేశారు.
ఒకప్పుడు అన్నీ సమస్యలే..
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి 75కి.మీ.ల దూరంలో విసిరేసినట్లుగా ఎత్తైన గుట్టల ప్రాంతంలో ‘కొర్రతండా’ పంచాయతీ ఉన్నది. తండాలో ఒకప్పుడు అంతర్గత రహదారులు అధ్వానంగా ఉండేవి. తాగునీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయించేవారు. మోడువారిన చెట్లు తప్ప పచ్చదనమే కరువు ఇక్కడ. వీధి దీపాలు వెలగక అంధకారంలోనే తండాలు మగ్గేవి. పశువుల మల మూత్రాలు, మురుగు నీటితో వీధులన్నీ అపరిశుభ్రంగా ఉండేవి.
ఇప్పుడన్నీ ప్రత్యేకతలే..
వీధుల్లో పిచ్చిమొక్కలు, చెత్త అనేది కనబడదు. వర్షపు నీరు, ఇతర నీరు నిల్వ చేయడానికి ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటయ్యాయి. మురుగునీరు కూడా ఇందులోకి వెళ్లేలా చర్యలు చేపట్టడంతో ఇండ్ల మధ్య నుంచి మురుగు నీరు పారే దృశ్యాలే ఇక్కడ కన్పించవు. బహిరంగ మల విసర్జన నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతగా నిర్వహించేందుకు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా పంచాయతీ పాలకవర్గం గిరిజనులను చైతన్యపర్చింది. పంచాయతీలో ఎన్ని ఇండ్లు ఉంటే అన్నింటికీ మరుగుదొడ్ల నిర్మాణాలు ఉన్నాయి. వీధుల్లో చెత్తను పారవేయకుండా ప్రతి ఇంటికీ చెత్త బుట్టలను పంపిణీ చేసి ఎప్పటికప్పుడు చెత్తను సేకరించి పంచాయతీ ట్రాక్టర్లో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. హరితహారం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ పంచాయతీ పరిధిలో మొక్కలను రోడ్లకు ఇరువైపులా నాటారు. అలాగే ప్రతి ఇంటికీ పండ్ల మొక్కలను పంపిణీ చేయగా, వాటి సంరక్షణ బాధ్యతలను గిరిజనులే చూసుకుంటున్నారు. రాత్రి వేళల్లోనూ తండాల్లో విద్యుత్ కాంతులు వెదజల్లేలా.. ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. 40వేల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ను నిర్మించగా, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి.
మారుమూలకూ..సంక్షేమ పథకాలు..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మారుమూలన ఉన్న కొర్ర తండా పంచాయతీలోని గడపగడపకూ ఏదో ఒక రూపంలో అందుతున్నాయి. 71 మందికి ఆసరా, ఇతర పింఛన్లు అందుతున్నాయి. 186 కుటుంబాలకు రేషన్ దుకాణం ద్వారా రూపాయికి కిలో బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు అందుతున్నాయి. రైతుబీమా పథకం కింద ఆరు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సాయం అందించి తెలంగాణ ప్రభుత్వం కొండంత భరోసాను కల్పించింది. ‘రెండేండ్ల కిందట నా భర్త చనిపోవడంతో నెల రోజులకే బీమా సాయం ఐదు లక్షలు వచ్చినయ్. కొంత అప్పు తీర్చుకొని మిగతా డబ్బులతో ఆడబిడ్డ పెండ్లి చేసిన’ అని తండాకు చెందిన కొర్ర బుజ్జి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నది. అలాగే ఈ ఒక్క తండాలోనే 20 మందికి కల్యాణలక్ష్మి పథకం కింద సాయం అందింది. మరో 24మంది కేసీఆర్ కిట్లను అందుకోగా, 222 మంది గిరిజన రైతులు ప్రతి ఏటా రెండు సీజన్లలో పెట్టుబడి సాయాన్ని అందుకుంటున్నారు.