చౌటుప్పల్, సెప్టెంబర్ 13 : పట్టణాల్లో జనాభా పెరిగిపోవడం.. స్థలాభావంతో చనిపోయిన వారి దహన సంస్కారాలకు సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ఇబ్బందులను తీర్చేందుకు గ్రామాలు, పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి కాగా.. పట్టణాల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో వైకుంఠ ధామాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 3.50 కోట్లతో 13 వైకుంఠధామాలను నిర్మిస్తున్నారు. పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డలో రూ. కోటితో రెండెకరాల స్థలంలో మోడ్రన్ మహాప్రస్థానాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో రూ.40లక్షలతో, ఊర చెరువు పక్కన రూ. 20లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో వసతులు కల్పించడంతో పాటు మరింత ఆధునికంగా నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే నిధులు విడుదల కాగా పనులు కూడా ప్రారంభమయ్యాయి. పనులు వేగంతో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని చౌటుప్పల్, తంగడపల్లి, లక్కారం, తాళ్లసింగారం, లింగారెడ్డిగూడెం, లింగోజీగూడెం గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం చేపడుతున్నారు. చౌటుప్పల్లో రూ.1.28 కోట్లతో మూడు ప్రాంతాల్లో, తంగడపల్లిలో రూ. 60 లక్షలతో మూడు ప్రాంతాల్లో, లింగోజీగూడెంలో రూ. 18లక్షలతో రెండు ప్రాంతాల్లో, తాళ్లసింగారంలో రూ. 15లక్షలతో, లింగారెడ్డిగూడెంలో రూ. 8 లక్షలతో వైకుంఠధామాల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న శ్మశాన వాటికలను ఆధునీకరించేందుకు, వసతులు కల్పించేందుకు కోటి రూపాయలతో పనులు చేపట్టేందుకు పనులు చేపట్టారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తు న్నాం. రూ.3.50 కోట్లతో 13 ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్నాం. బంగారిగడ్డలో రూ. కోటితో మహాప్రస్థానం పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు ఇండ్ల మధ్యనున్న శ్మశాన వాటికలకు ప్రహారీలు, వసతులు కల్పించడం వంటి పనులు చేపడుతున్నాం.
-వెన్రెడ్డి రాజు, మున్సిపల్ చైర్మన్, చౌటుప్పల్