యాదాద్రి భువనగిరి, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో ధరణి ద్వారా తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇటీవల కాలంలో జోరందుకున్నది. ఆరంభంలో 10 రిజిస్ట్రేషన్లకే అవకాశం ఉండేది. తర్వాత రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రస్తుతం 30 వరకు రిజిస్ట్రేషన్లు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రతి నిత్యం 30 స్లాట్లు బుక్ అవుతుండటంతో తహసీల్దార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేసిన గత జూన్ 21 నెల నుంచి నేటి వరకు జిల్లాలోని 17 మండలాల పరిధిలో 4,879 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగగా, 1,238 రిజిస్ట్రేషన్లు గడిచిన వారం రోజుల వ్యవధిలోనే అయ్యాయి. అత్యధికంగా భువనగిరి మండలంలో 579, ఆ తర్వాత వలిగొండ మండలంలో 430 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే తుర్కపల్లి మండలంలో 348, రాజాపేట మండలంలో 305, ఆలేరు మండలంలో 333, యాదగిరిగుట్ట మండలంలో 286 రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ వారం రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు ఊహించని రీతిలోజరిగాయి.
ఊపుమీదున్న రియల్ రంగం..
జిల్లా ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా విస్తరిస్తోంది. సకల సౌకర్యాలు.. సదుపాయాలతో నలు దిక్కులకూ వ్యాపిస్తున్నది. రాష్ట్ర రాజధానితోపాటు ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్నప్పటికీ జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం సుస్థిరంగా పరుగులు తీస్తోంది. చేరువనే ఉన్న హైదరాబాద్ నగరానికి పెద్దఎత్తున వస్తున్న వలసల నేపథ్యంలో పెరిగిన జనాభా కారణంగా రాజధాని కిటకిటలాడుతున్నది. ఈ క్రమంలో సౌకర్యాలు, సదుపాయాల పరంగానూ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే స్థాయి సౌకర్యాలతో అదే ధరకే భూములు, ప్లాట్లు, ఇండ్లు లభిస్తుండటంతో జిల్లాలో రియల్ ఎస్టేట్ కళకళలాడుతున్నది. జిల్లాగా ఏర్పడిన నాటి నుంచే ఈ ప్రాంతంలో రియల్ భూం కొనసాగుతుండగా, యాదాద్రి ఆలయాన్ని మరో వాటికన్ సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో రియల్ రంగం మరింత జోరందుకున్నది.
ఆలయం అభివృద్ధి జరగడం ఒక ఎత్తయితే.. రాజధానికి దగ్గరగా ఉండటం వల్ల కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు.. ఉప్పల్ నుంచి యాదాద్రికి హైస్పీడ్ మెట్రో రైల్ ఏర్పాటు.. ఘట్కేసర్-రాయగిరి మధ్యన ఎంఎంటీఎస్ రైలును నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తుండటం.. ఐటీ పరిశ్రమలు తరలివస్తుండటం వంటి పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కస్టమర్లు, ఇన్వెస్టర్లు యాదాద్రి పరిసర ప్రాంతాల్లోనూ, దూర ప్రాంతాల్లోనూ ప్లాట్లు కొంటున్నారు. ఫలితంగా మొన్నటి వరకు రూ.లక్షల్లో ఉన్న భూముల ధరలు రూ.కోట్లకు పడగలెత్తాయి. ఇదే క్రమంలో ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఆదాయం సైతం గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
స్లాట్ లేకున్నా రిజిస్ట్రేషన్…
లాక్డౌన్ ఎత్తివేతకు ముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూములు, వివాహ, ఇతర రిజిస్ట్రేషన్ల కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాలన్న నిబంధన ఉండేది. అయితే లాక్డౌన్ కారణంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు వివిధ వర్గాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. స్లాట్ బుక్ చేసుకోకపోయినా.. నేరుగా అదేరోజు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేయడంలో తొలి ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం సూచించడంతో ఇందుకనుగుణంగా జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, యాదగిరిగుట్ట, మోత్కూరు, రామన్నపేట రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత జూన్ 21నుంచి జూలై 19వ తేదీ వరకు బీబీనగర్, చౌటుప్పల్, రామన్నపేట, మోత్కూరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో మొత్తం 2,172 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగగా.. గడిచిన వారం రోజుల వ్యవధిలోనే 541 రిజిస్ట్రేషన్లు జరిగాయి.