యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికతతో పాటు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వైటీడీఏ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. యాదాద్రీశుడి ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయం తుది మెరుగుల పనులతో పాటు, భక్తులకు కావాల్సిన వసతులపై అధికారులు దృష్టి సారించారు. గతంలో శివాలయం ఎదుట 8.50 ఫీట్ల ఎత్తుతో ప్రహరీ నిర్మించారు. భక్తి భావం ఉట్టిపడేలా అత్యంత అద్భుతంగా నిర్మించిన శివాలయాన్ని పూర్తిగా కప్పి ఉన్న ప్రహరీని తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వైటీడీఏ అధికారులను ఆదేశించారు. దీంతో శివాలయం ఎదుట ఉన్న ప్రహరీని తొలగించి ప్యారాపిట్ వాల్ను నిర్మించి వాటికి బంగారు వర్ణపు అల్యూమినియం గ్రిల్స్ ఏర్పాటు చేశారు.
యాదాద్రీశుడిని కాలినడకన దర్శించుకునే భక్తులకు సకల సౌకర్యాలతో శ్రీవారి మెట్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. స్వామి వారిని దర్శించుకునేందుకు పాదయాత్రతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా సువిశాలంగా మెట్లను నిర్మించారు. కొండకింద స్వామి వారి వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి మొత్తం 365 శ్రీవారి మెట్లను నిర్మిస్తున్నారు. శివాలయం వరకు మెట్ల పనులు పూర్తి కాగా తుది మెరుగుల పనులు పురోగతిలో ఉన్నాయి.యాదాద్రి కొండపై క్యూ కాంప్లెక్స్ పక్కనే స్వామి వారి సేవలో వినియోగించేందుకు రూ. 5.3 కోట్లతో ప్రత్యేకంగా విష్ణు పుష్కరిణిని నిర్మించారు. పొడవు 19 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో స్వామి వారి మండపంతో నిర్మించారు. పుష్కరిణీ మరింత వెడల్పు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో దక్షిణ ప్రాంతంలో మరో 6 ఫీట్ల వెడల్పును పెంచారు. ఇక్కడే మెట్ల నిర్మాణాలు చేపట్టగా పనులు సాగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి నిర్వహించే చక్రతీర్థ స్నానంతో పాటు స్వామి వారి ఇతర సేవలకు ఈ పుష్కరిణీని వాడనున్నారు. పుష్కరిణీలో అర్చకులు బట్టలు మార్చుకునే ప్రత్యేక గదులను సైతం నిర్మించారు. శివరాత్రి ఉత్సవాల్లో రథోత్సవానికి వినియోగించే రథాన్ని భద్ర పరిచేందుకు శివాలయం వాయు దిశలో 21ఫీట్ల పొడవు, 12 ఫీట్ల వెడల్పుతో రథశాలను నిర్మించారు. ఈ రథశాల అంచులకు దేవతామూర్తులతో తయారు చేసిన ఫైబర్ తొడుగుల బిగింపు పనులు సాగుతున్నాయి.