60 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు జోహార్! తొలిదశ ఉద్యమం (1969)లోనే దాదాపు 400 మంది ప్రాణాలు అర్పించారు. మలిదశ నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలు బోనాలు, బతుకమ్మ పండుగలు. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది.
శత్రుదేవో భవః మన కడుపు కొట్టినవాడు, మన ఉనికిని ప్రశ్నించినవాడు, మన బువ్వ లాక్కున్నవాడు, మన నీళ్లు దోచుకున్నవాడు, మన నిధులు తన్నుకెళ్లినవాడు.. మన బలమేమిటో మనకు గుర్తుచేశాడు.
చంద్రబాబు రెండు కండ్ల సిద్ధాంతం వల్లె వేసినందుకే తెలంగాణ ప్రజానీకం మూడోకన్ను తెరిచింది. ప్రతినాయకుల ప్రస్తావనతోనే ఏ గెలుపు కథకైనా పరిపూర్ణత సిద్ధిస్తుంది.
రెండో దశ ఉద్యమంలో ‘ధూంధాం’లు దుమ్మురేపాయి. ఆ ఆటలు, ఆ పాటలు, ఆ కేకలు, ఆ అరుపులు.. ఉద్యమావేశానికి ఇంధనం అయ్యాయి. కొత్త పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయి. కొత్త గాయకులు పుట్టుకొచ్చారు. అదో పెద్ద సాంస్కృతిక సైన్యం!
తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష పుట్టిందే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే సిద్ధాంతం మీద. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ప్రతి చోటా తీవ్ర అన్యాయమే జరిగింది. ముఖ్యంగా నియామకాల విషయంలో!
లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు. చారిత్రక ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు లోక్సభలో ఆమోద ముద్ర లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ మద్దతు తెలిపింది. రాష్ట్రపతి రాజముద్ర తర్వాత 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
తెలంగాణ సాధించడం ఒక ఎత్తు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని కోరుకున్నట్టు తీర్చిదిద్దుకోవడం మరొక ఎత్తు. గవర్నెన్స్ అంటే అదే! పాలనా పరంగా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సర్కారుగా మన్ననలు అందుకుంటున్నది.
కాళేశ్వరంతో నేల సస్యశ్యామలమైంది. యాదాద్రితో మనకంటూ ఓ ఆధ్యాత్మిక కేంద్రం సిద్ధమైంది. కట్టుదిట్టమైన పోలీసింగ్తో శాంతికి భద్రత లభించింది. ధరణితో కబ్జాలకు కళ్లెం పడింది. రైతుబంధుతో ఆత్మహత్యలు ఆగాయి. ప్రతి పథకం తెలంగాణ తల్లి మెడలో పచ్చల పతకమే!
ఈ మహానగరం తెలంగాణ ఆత్మ! బహుళజాతి సంస్థల చిరునామా. కొలువుల ఖజానా. అభివృద్ధి నమూనా. ఔషధ నగరి. ఐటీ పురి. తెలంగాణ ప్రజలు గోల్కొండ కోటకు రాళ్లెత్తారు. చార్మినార్ నిర్మాణానికి పునాదులు తవ్వారు. మన కులీ, మన నిజాం.. ఈ నగర సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
తెలంగాణ భాషను చూసి నవ్వారు. తెలంగాణ సంస్కృతిని గేలి చేశారు. తన గడ్డమీదే తెలంగాణ బిడ్డ ద్వితీయ శ్రేణి పౌరుడిగా బతకాల్సిన పరిస్థితి. కాబట్టే, తెలంగాణ ఉద్యమం ‘నేను.. నా జాతి’ అన్న ఆత్మగౌరవ నినాదాన్ని భుజానికెత్తుకుంది.
ప్రొఫెసర్ జయశంకర్ సార్.. తెలంగాణ స్వేచ్ఛకోసం తుదిశ్వాస విడిచే వరకూ పోరాడారు. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా ఆయన మాట, రాత, ఆలోచన, అంతర్మథనం.. ఎప్పుడూ తెలంగాణ చుట్టే!
ఒక ఉక్కు సంకల్పం. స్వరాష్ట్ర సాధన కోసం బరిగీసి, కొట్లాడిన వ్యక్తి. తెలంగాణ ప్రజల వెతలు, బాధలు తీరాలం రాష్ట్ర సాధనే మార్గమని నమ్మి, చావునోట్లో తలపెట్టి, మృత్యువును గెలిచి.. స్వరాష్ర్టాన్ని సాధించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు .. తెలంగాణ జాతిపిత!
తెలంగాణ ఉద్యమచరిత్రలో మర్చిపోలేని మైలురాయి మిలియన్ మార్చ్. 2011 మార్చి 10న తెలంగాణ ప్రజానీకం చేపట్టిన మహత్తర కార్యక్రమం ఇది. ఉద్యమకారులకు, ప్రజలకు మానసిక ధైర్యాన్నిచ్చింది.
తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తయితే, ఆ ఉద్యమాన్ని భుజానికెత్తుకొని ప్రజల్లోకి తీసుకెల్లే మాధ్యమం ఒక ఎత్తు. మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న క్రమంలో నాటి ఆంధ్రప్రదేశ్లోని మీడియా సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు పన్నాయి.
మనకంటూ సొంతంగా ఓ మాధ్యమం, మన యాస భాషలకు, పోరాటాలకు కొంగొత్తగా ఊపిరులూదే పత్రిక కావాలన్న లక్ష్యంతో పదేండ్ల క్రితం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆవిర్భవించింది. ఉద్యమం నుంచి ప్రగతిపథం వరకూ ప్రతీ బాధ్యతనూ విజయవంతంగా నిర్వహిస్తున్నది.
తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ పోరాటం వరకూ ఇక్కడినుంచే యువతకు దిశా నిర్దేశం. మొత్తం ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం ఓయూ. లాఠీ దెబ్బలనూ, తుపాకుల మోతలనూ తట్టుకుని, తల ఎగరేసిన తెలంగాణ జెండా ఉస్మానియా!
1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి కోస్తా, రాయలసీమ, తెలంగాణ… అన్ని ప్రాంతాల నాయకులూ ఓ అంగీకారానికి వచ్చారు. అయితే, తెలంగాణ అభివృద్ధిపై స్థానిక నాయకులకు కొన్ని సందేహాలు రావడంతో వాటిని నివృత్తి చేసేందుకు 14 అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. అదే ‘పెద్ద మనుషుల ఒప్పందం’.
కుతుబ్ షాహీ వంశస్థులుకులీ కుతుబ్ షా గోల్కొండ కేంద్రంగా జెండా ఎగరేశాడు. భాగ్యనగరాన్ని నిర్మించారు. తెలంగాణ కవులను గౌరవించారు. అసఫ్ జాహీలూ అంతే! మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ను ఆధునిక నగరంగా తీర్చిదిద్దాడు.
కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది వీరనారి రాణి రుద్రమదేవి.రుద్రమదేవి స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమచరిత్రలో మరో మైలురాయి సకల జనుల సమ్మె. 2011 సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమైన ఈ సమ్మె దాదాపు 42 రోజులపాటు ఉధృతంగా సాగింది.
మన సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రతీకగా తెలంగాణ తల్లికి ఓ రూపాన్నీ, ఆహార్యాన్నీ కల్పించారు కేసీఆర్. తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని 2007 నవంబర్ 15న తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు.
విభజన తప్పదని అర్థమైపోయింది. తెలంగాణ అనివార్యమని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లోనూ ఆంధ్ర పాలకులు కుటిల ఎత్తులూ, నక్కజిత్తులూ మానలేదు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే వాదనను తెరమీదికి తెచ్చారు. రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేయాలంటూ వితండ వాదం చేశారు. చివరికి, ఆ పప్పులేం ఉడకలేదు.
ఉద్యమం సమయంలో ఆంధ్రపాలకులు చూపిన బూచి కరెంటు! ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ చీకటిమయం అవుతుందని భయపెట్టారు. కేసీఆర్ ఆ కట్టుకథల్ని చెత్తబుట్ట పాలు చేశారు. విద్యుత్ వినియోగంలో దేశంలోనే ముందువరుసలో ఉన్నది తెలంగాణ.
స్వరాష్ట్రం వచ్చేవరకూ మనదిఆత్మహత్యల తెలంగాణే. రాష్ట్రం సిద్ధించాక జననేత సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రజా సంక్షేమ పథకాలు బంగారు తెలంగాణవైపు నడిపిస్తున్నాయి. ఎవుసం ఓ పండగలా మారింది.
కొన్ని అనుకోని పరిణామాలూ తెలంగాణ ఉద్యమానికి కలిసొచ్చాయి. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పతనం అంచున ఉన్నది. తెలంగాణకు మొగ్గు చూపితే కనీసం ఒక ప్రాంతంలో అయినా బతికించుకోవచ్చని సోనియమ్మ ఆశ!
పేలాలు ఏరుకోవడంలో పేరు గాంచిన భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో కొంత లాభపడాలని చూసింది. ఇంకా ఆలస్యం చేస్తే, పరిస్థితి అదుపు తప్పుతుందని, ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారనీ ప్రధానికి నివేదిక అందింది.
వీటన్నిటికి మించి కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమం మరింతగా బలపడుతున్న పరిస్థితి. ఇదీ తెలంగాణ ప్రకటన సమయానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఉన్న వాతావరణం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుగు లేని నేత వైఎస్ఆర్. ఆయన మాటల్లో, చేతల్లో తెలంగాణ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించేది. అసెంబ్లీ సాక్షిగానే ఉద్యమనేతలతో ఎకసెక్కాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి.