YOUR GUIDE
కొంతమంది బిడ్డ పుట్టేంత వరకూ వాంతులతో ఇబ్బందిపడుతూ ఉంటారు. ఈ సమస్యను ‘హైపరెమిసిస్ గ్రావిడరమ్’ అంటారు.
ఈ ఇబ్బంది ఎవరికైనా రావచ్చు. అంతేతప్ప, కడుపులో ఆడ శిశువు ఉన్నవాళ్లకే ఇలా జరుగుతుందన్నది అవాస్తవం.
సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. లేదంటే డీహైడ్రేషన్, పోషకాహారలోపం తదితర సమస్యలు వస్తాయి.
కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని తాగితే ఎర్రటి పిల్లలు పుడతారన్నదీ అపోహే. బిడ్డ రంగు జన్యుపరంగా వస్తుంది.
తెలివితేటలు కూడా కొంతమేర వారసత్వమే. అయితే కడుపులో బిడ్డ మెదడు ఎదుగుదలకు కొన్ని ఆహార పదార్థాలు ఉపకరిస్తాయి.
గుడ్డు తెల్ల సొన, అవకాడో, చేపలు, గింజలు, ఫోలిక్ సప్లిమెంట్లు తీసుకోవాలి. మద్యంలాంటి దురలవాట్లు బిడ్డ మెదడును దెబ్బతీస్తాయి.
తల్లి కాబోతున్నామని తెలిసినప్పటి నుంచీ మునుపటికంటే రెండింతలు తినడం మొదలుపెడతారు. ఈ ధోరణి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
మొదటి త్రైమాసికంలో తల్లికి సాధారణ ఆహారమే సరిపోతుంది. రెండో త్రైమాసికంలో రోజుకు 340 క్యాలరీలు, మూడో త్రైమాసికంలో 450 క్యాలరీలు అదనంగా అవసరం అవుతాయి.
ఒక అరటిపండు, గ్లాసు పాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ లెక్కలు కూడా గర్భిణి బరువును బట్టి నిపుణులు నిర్ణయిస్తారు.
ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆహారాలపై ఇష్టం పెరుగుతుంది. తినాలని అనిపించినవన్నీ ఆరగించడం మంచిదని చెబుతుంటారు పెద్దలు. ఈ మాట పూర్తిగా నిజం కాదు.
ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కొన్ని ఆహారపదార్థాలు నచ్చడం, నచ్చకపోవడం అన్నది జరుగుతుంది.
ఆ మార్పు ప్రభావం ముఖ్యంగా వాసన, రుచి మొదలైనవాటిపై పడుతుంది.
‘ప్రసూతి మధుమేహం’ వచ్చినవాళ్లకు స్వీట్ల మీద మక్కువ పెరుగుతుంది. అలాగే కొందరికి సుద్ద, మట్టి తినాలపిస్తుంది. ఇలాంటప్పుడు డాక్టర్ను సంప్రదించాలి.