వరంగల్ : ఈ నెల 30న జరుగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు డాక్టర్ ఓంప్రకాశ్, పోలీస్ అబ్జర్వర్ అనుపమ్ అగర్వాల్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఏర్పాట్లను తెలుసుకునేందుకు వీరిరువురు బుధవారం నగరానికి వచ్చారు. వీరికి హరిత హోటల్లో జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్జోషీలు స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల అబ్జర్వర్లు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. నియోజకవర్గాల సరిహద్దులలో చెక్పోస్ట్లను ఏర్పాటు చేసిన జిల్లాకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల ఖర్చు బృందాలు ప్రతి రోజూ నమోదు చేయాలన్నారు. ఉప ఎన్నిక నివేదికను కేంద్రానికి నివేదిస్తామని వారు తెలిపారు. ఉప ఎన్నికకు సంబందించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని వారు అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో వాసుచంద్ర, డీపీసీ పుష్ప, హనుమకొండ తాసిల్దార్ రాజ్కుమార్ పాల్గొన్నారు.
భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న పరిశీలకులు
భద్రకాళీ అమ్మవారిని ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఓంప్రకాష్, అనుమప్ అగర్వాల్లు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎన్నికల పరిశీలకులకు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.